కాలినడకన వెళ్తుంటే కాటేశారు

5 Jan, 2022 04:21 IST|Sakshi

బస్సు సౌకర్యం లేక పాఠశాలకు  నడిచి వెళ్తున్న విద్యార్థినిపై లైంగికదాడి  

అదుపులో ఇద్దరు యువకులు.. వనపర్తి జిల్లాలో ఘటన 

పాన్‌గల్‌: కాలినడకన పాఠశాలకు వెళ్తున్న ఓ విద్యార్థినిని కామాంధులు అటకాయించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం మల్లాయపల్లిలో చోటు చేసుంది. మల్లాయపల్లికి చెందిన విద్యార్థిని(14) పాన్‌గల్‌ మండలం చింతకుంటలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేకపోవడంతో స్వగ్రామం నుంచి రోజూ స్నేహితులతో కలసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లి వస్తోంది.

రోజులాగే మంగళవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి పాఠశాలకు వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన వివాహితులైన నాగరాజు, అనిల్‌ రెండు వేర్వేరు బైక్‌లపై వచ్చి స్కూల్‌ వద్ద వదిలేస్తామని వారిని నమ్మించారు. అనిల్‌ ఇద్దరు బాలికలను తన బైక్‌పై ఎక్కించుకుని ముందు వెళ్లగా, నాగరాజు మరో బాలికను ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు బాలికలను స్కూల్‌ వద్ద వదిలిపెట్టి తిరిగి వచ్చిన అనిల్‌ సైతం బాధితురాలిపై అఘాయిత్యం చేశాడు.

ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాధితురాలిని భయపెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు ఏడుస్తూ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో వారు కుటుంబసభ్యులు, మల్లాయపల్లి సర్పంచ్‌ జయకళకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోక్సో, అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్, వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు, ఆధారాలను సేకరించారు. నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు