Indrani Mukerjea: ఆమె బతికే ఉంది.. నమ్మరా?! మరో ట్విస్టు

25 Jan, 2022 15:22 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లో నిలిచింది. చనిపోయిందని భావిస్తున్న తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ (జనవరి 24, సోమవారం) ముంబైలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఒక  రాతపూర్వక దరఖాస్తును  లాయ‌ర్ ద్వారా కోర్టుకు సమర్పించింది. ఈ దరఖాస్తు కాపీని సీబీఐకి అందజేసిన  కోర్టు. ఫిబ్రవరి 4వ తేదీన త‌న  ప్రతిస్పందన  ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది.  (షీనా బోరా హత్య కేసు : మరో సంచలన ట్విస్ట్‌)

ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి  తెలియజేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించింది. తాను రాసిన లేఖపై సీబీఐ ఎలాంటి చర్య తీసుకుందో తెలుసుకోవాలని ఇంద్రాణి కోర్టును కోరింది. దీనిపై మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు తాపే ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది.  అంతేకాదు బోరా ఖచ్చితంగా బతికే ఉంది అనేందుకు  తన వద్ద బలమైన కారణం ఉందని తెలిపింది.  జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్  అంటూ ఆవేదన వ్యక్తం  చేసిన ఇంద్రాణి తనకు సత్వరమే న్యాయం చేయాలని కోరింది

కాగా తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ గత ఏడాది డిసెంబరులో  ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై  దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్‌ చేసింది. కశ్మీర్‌లో షీనా బోరాను కలిశానని సహ ఖైదీ తనకు చెప్పిందని ఆమె తన లేఖలో పేర్కొంది. కశ్మీర్‌లో షీనా బోరా కోసం గాలింపు చేపట్టాలని ఆమె సీబీఐని కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు