Chanda Nagar: యువతి ఆత్మహత్య కేసులో ప్రియుడే హంతకుడు

27 Oct, 2021 07:34 IST|Sakshi
నాగచైతన్య(ఫైల్‌) 

పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకే..

కత్తితో గొంతు కోసి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం

ప్లాన్‌ ప్రకారమే కత్తి, తాడు ఓడ్కా బాటిల్‌ కొనుగోలు

సాక్షి, చందానగర్‌: చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 25వ తేదీన యువతి ఆత్మహత్య కేసులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవిడికి చెందిన నాగచైతన్య(24) ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియుడు గుంటూరు జిల్లా రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి(29) ప్రియురాలిని హత్య చేసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు.  
చదవండి: ఒంగోలు ఆస్పత్రిలో ప్రేమ..హైదరాబాద్‌కి వచ్చి కత్తితో పొడుచుకుని..

కేసును క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు అనేక విషయాలు తెలిశాయి. ఒంగోలులోని జిన్స్‌ హాస్పిటల్‌లో నాగచైతన్య నర్సు. అక్కడే కోటిరెడ్డి మేనేజర్‌గా పనిచేసేవాడు.  వీరిద్దరి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నాగచైతన్య తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్‌ వేశాడు. 23వ తేదీ ఉదయం సిటిజన్‌ ఆస్పత్రి వరకు వచ్చిన అతను సాయంత్రం వరకు అక్కడే ఉండి నాగచైతన్యను ఎస్‌వీఆర్‌ గ్రాండ్‌ హోటల్‌లోని ఓయో రూమ్‌కు తీసుకెళ్లాడు. 
చదవండి: ‘సంబంధం’ పెట్టుకుని.. సస్పెండయ్యారు!

ఓడ్కా తాగి రాత్రి అక్కడే బస చేసిన అతను స్విగ్గీలో ఇద్దరికీ భోజనం ఆర్డర్‌ చేశాడు. 24 తేదీ ఉదయం 11 గంటలకు హోటల్‌ గదికి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10.30 గంటల సమయంలో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చేరాడు.  అతను నాగచైతన్యను హత్య చేసి ట్రైన్‌లో ఒంగోలుకు చేరుకున్నట్లు తెలిసింది. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో హోటల్‌ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా నాగచైతన్య రక్తపు మడుగులో మృతి చెందింది.

కత్తి, తాడు కొనుగోలు.. 
23న నగరానికి వచ్చిన కోటిరెడ్డి ఓ సూపర్‌ మార్కెట్‌లో కత్తి, తాడు కొనుగోలు చేశాడు. ఓయో రూమ్‌కు తీసుకెళ్లిన కోటిరెడ్డి ముందుగానే ఓడ్కా బాటిల్, కత్తి, తాడు తన బ్యాగ్‌లో తీసుకెళ్లాడు. రూమ్‌కు వెళ్లిన కొద్ది సేపటికే బయటకు వెళ్లి కూల్‌డ్రింక్స్‌ తీసుకొచ్చాడు. స్విగ్గీలో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. స్విగ్గీ బాయ్‌ నుంచి ఫుడ్‌ డెలివరీ తీసుకున్న అతను రూమ్‌లోకి వెళ్లి మరుసటి రోజు ఉదయం వరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు.

రాత్రి ఇరువురు ఓడ్కా సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. అనంతరం వివాహం విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకొని ఉంటుందని ఆ క్రమంలోనే ప్రియురాలిని కత్తితో గొంతుకోసి హత్య చేసి ఉంటాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. అనంతరం ఫ్యాన్‌కు ఉరి వేసేందుకు చున్నీ ప్రయత్నించి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. 

కులాంతరమే హత్యకు కారణమా? 
కోటిరెడ్డి రెడ్డి సామాజిక వర్గం కావడంతోనే నాగచైతన్యను వివాహం చేసుకునేందుకు అతడి కుటుంబ సభ్యులు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. దళిత కులానికి చెందిన యువతి కావడంతో కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాగా ఒంగోలుకు వెళ్లిన సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు