Nupur Sharma నూపుర్‌ శర్మ ఫొటో షేర్‌ చేసినందుకు షాకింగ్‌ ఘటన.. అందరూ చూస్తుండగానే

28 Jun, 2022 19:42 IST|Sakshi

Udaipur Gruesome Murder: జైపూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన కన్హయ్య లాల్‌ అనే టైలర్‌ హత్యకు గురయ్యాడు. టైలర్‌ తన దుకాణంలో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన ఇద్దరు దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు. 

అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్‌ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు. టైలర్‌ హత్యోదంతంతో ఉదయ్‌పూర్‌లోని మల్డాస్‌ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు.

ఈఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. టైలర్‌ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో పోలీసులు మోహరించారు. 24 గంటలపాటు నగరంలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్‌ శర్మకు మద్దతుగా టైలర్‌ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినట్టు తెలిసింది. మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పారిపోతున్న నిందితులను రాజ్‌సమంద్‌ జిల్లాలోని భీం ప్రాంతంలో పట్టుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.


చదవండి👇
వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే?
ఉపాధ్యాయుడి హత్య: భార్యే హంతకురాలు.. వివాహేతర సంబంధంతో..

మరిన్ని వార్తలు