ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపులు: ఎస్సై సస్పెండ్‌..

3 Aug, 2021 16:34 IST|Sakshi

వరంగల్‌: వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. మహబూబాబాద్‌ జిల్లా అర్బన్‌ ఎస్సై శ్రీనివాసరెడ్డి.. తనను లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఎస్సై పోలిస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేసింది. ఎస్సై ట్రైనింగ్‌పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కన్నీటి పర్యంతమయ్యింది. కాగా, ప్రజలను కాపాడాల్సిన అధికారిపైనే.. ఫిర్యాదు రావడంతో పోలీస్‌ ఉన్నతా అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

దీనిపై స్పందించి పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి పూర్తి స్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మహిళా ట్రైనీ ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఎస్సై శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ నాగిరెడ్డి తాజాగా ఉత్తర్వులను జారీచేశారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు  పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు