సిద్ధూ హత్య కేసు: పోలీసు కస్టడీ నుంచి కీలక నిందితుడి పరార్‌!

2 Oct, 2022 12:54 IST|Sakshi

ఛండీగఢ్‌: పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ దీపక్‌ అలియాస్‌ టిను పోలీస్‌ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. శనివారం రాత్రి పోలీసు కస్టడీ నుంచి దీపక్‌ తప్పించుకుని పారిపోయినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్‌ ఇవ్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(సీఐఏ) సిబ్బంది ప్రైవేటు వాహనంలో మాన్సా నుంచి కపుర్థలా జైలుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో తరలిస్తున్న క్రమంలో అదును చూసి పోలీసుల నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. 

కస్టడీ నుంచి తప్పించుకున్న దీపక్.. గ్యాంగ్‌స్టర్‌, ప్రధాన నిందితుడు లారెన్స్‌ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు. సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు పథకం రచించటం నుంచి అమలు చేసే వరకు పాల్గొన్నట్లు భావిస్తున్న 15 మంది జాబితాలో దీపక్‌ పేరును చేర్చారు పోలీసులు. ప్రొడక్షన్‌ వారెంట్‌పై ఢిల్లీ పోలీసులు కొద్ది రోజుల క్రితమే దీపక్‌ను పంజాబ్‌ తీసుకొచ్చారు. శనివారం జరిగిన సంఘటనతో పోలీసుల నుంచి దీపక్‌ పారిపోవటం ఇది నాలుగోసారి కావటం గమనార్హం. గతంలో 2017లో అంబాలా సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవించాడు దీపక్‌. ఆ సమయంలో పెప్పర్‌ స్ప్రే ఉపయోగించి పారిపోయాడు. ఓసారి ఆసుపత్రికి తీసుకెళ్లగా తప్పించుకున్నాడు.

ఇదీ చదవండి: సిద్ధూ మూసేవాలా తండ్రిని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు

మరిన్ని వార్తలు