Sidhu Moose Wala Murder Case: మాస్టర్‌ మైండ్‌ అతనేనన్న ఢిల్లీ పోలీసులు

8 Jun, 2022 21:15 IST|Sakshi

ఢిల్లీ: పంజాబీ సింగర్‌ సిద్ధూ హత్య కేసులో ఊహించిందే జరిగింది. ఈ హత్య కుట్రకు మాస్టర్‌ మైండ్‌ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ అనే తేల్చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ మేరకు బుధవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. అయితే పంజాబ్‌ సిట్‌ దీనిని ధృవీకరించాల్సి ఉంది.

మే 29వ తేదీన హత్యకు గురయ్యాడు పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసే వాలా. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశాడు. గోల్డీ బ్రార్‌, బిష్ణోయ్‌ అనుచరుడు. దీంతో హత్య జరిగిన నాటి నుంచే  బిష్ణోయ్‌పై పోలీసులకు అనుమానం నెలకొంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా లారెన్స్‌ పేరును చేర్చారు.

అయితే నేరాన్ని అంగీకరించని లారెన్స్‌ బిష్ణోయ్‌.. తన ప్రమేయం లేకుండానే తన గ్యాంగ్‌ ఈ హత్యకు పాల్పడిందని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అంతేకాదు గోల్డీ బ్రార్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నట్లు అంగీకరించాడు. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వాళ్లిచ్చిన సమాచారం మేరకు లారెన్స్‌ బిష్ణోయ్‌ ఈ హత్య కుట్రకు మూలకారణంగా తేల్చారు. ప్రస్తుతం ఢిల్లీ తీహార్‌జైల్లో ఉన్న లారెన్స్‌ బిష్ణోయ్‌ను ఇప్పటికే పోలీసులు పలుమార్లు ప్రశ్నించారు కూడా. ఇక పోలీసుల అదుపులో ఉన్న నిందితుల సమాచారం మేరకు ఆరు బృందాలను ఏర్పాటు చేసిన పంజాబ్‌ పోలీసులు.. ఆరుగురు షార్ప్‌షూటర్ల కోసం నాలుగు రాష్ట్రాలను జల్లెడ పట్టేందుకు సిద్ధమయ్యారు. 

మరిన్ని వార్తలు