Sidhu Moose Wala Murder Case: ముందే తెలుసుంటే...ఈ ఘోరం జరిగి ఉండేది కాదు

9 Jul, 2022 20:54 IST|Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ హత్య కేసుకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.  ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ...పంజాబ్‌ సింగర్‌ సిద్ధూని హత్యకు స‍ంబంధించిన కుట్రదారుల్లో ఒక వ్యక్తి హత్యకు నెలరోజుల మందుగానే నకిలీ పాస్‌పోర్టుతో భారత్‌​ వదిలి పారిపోయాడని చెప్పారు. ఆ వ్యక్తి సచిన్‌ బిష్ణోయ్‌ అని, అతను జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ సన్నిహిత సహచరుడని పేర్కొన్నారు.

ఈ హత్యకు ప్లాన్‌ చేసి తర్వాతే నకీలీ పాస్‌పోర్ట్‌ సహాయంతో ఇండియా వదిలి పారిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని తాము ముందుగానే గుర్తించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సచిన్‌ బిష్ణోయ్‌ ఏప్రిల్‌ 21 వరకు భారత్‌లోనే ఉన్నాడని  తెలిపారు. నిందితుడు కెనడాకు చెందిన గోల్డీ బ్రార్‌తో పాటు రాపర్‌ని హత్య చేసిన ఇద్దరు ప్రధాన కుట్రదారులలో ఒకరుగా భావిస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీలోని సంగమ్ విహార్ చిరునామాతో తిలక్ రాజ్ తోటేజా పేరుతో సచిన్ బిష్ణోయ్‌ నకిలీ పాస్‌పోర్ట్‌ను పొందినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధూ మూసే వాలేని హత్య చేసింది మే 29న అయితే సచిన్‌ బిష్ణోయ్‌ ఏప్రిల్‌ 21నే భారత్‌ని వదలి దూబాయ్‌ పారిపోయాడని అక్కడి నుంచి అజర్‌బైజాన్‌ వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు సచిన్ బిష్ణోయ్ ఢిల్లీలో ఉన్నప్పుడే మూస్ వాలా హత్యకు సంబంధించిన మొత్తం ప్లాన్‌ని సిద్ధం చేసి, షూటర్లకు షెల్టర్లు, డబ్బు, వాహనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదీగాక సిద్ధూ మూసే వాలేకి ఉన్న 424 భద్రతా సిబ్బంది తొలగించిన తర్వాత ఈ హత్య జరగడం గమనార్హం.

(చదవండి: Sidhu Moose Wala Murder Case: మాస్టర్‌ మైండ్‌ అతనేనన్న ఢిల్లీ పోలీసులు)

మరిన్ని వార్తలు