ఉరివేసుకుని సింగర్‌ భార్య ఆత్మహత్య

13 May, 2021 20:53 IST|Sakshi

బెంగళూరు : సరిగమప ఫేమ్‌, సింగర్‌ సుబ్రమణి భార్య జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. కోలార్‌, ధర్మరాయనగర్‌లోని పుట్టింట్లో బుధవారం ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జ్యోతి భర్త సుబ్రమణి కేఆర్‌పురలోని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సరిగమప టీవీ షో ద్వారా అతడు బాగా పాపులర్‌ అయ్యాడు. డిపార్ట్‌మెంట్‌లో అందరూ అతడు సింగర్‌ సుబ్రమణిగా పిలవటం మొదలుపెట్టారు. జ్యోతితో అతడికి 14 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పుట్టింటికి వెళ్లిన ఆమె సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి తాడు బిగుంచుకుని ఆత్మహత్య ప్రయత్నించింది. సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతున్న ఆమెను గుర్తించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ శ్వాస సంబంధ ఇబ్బంది తలెత్తడంతో మరో ఆసుపత్రికి తరలించటానికి ప్రయత్నించారు. ఎక్కడా బెడ్లు ఖాళీగా లేకపోవటంతో హోస్‌కోటలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి ఆమె మృత్యువాతపడింది. దీనిపై భర్త సింగర్‌ సుబ్రమణి మాట్లాడుతూ.. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని, ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌ రావటంతోటే ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. జ్యోతి కుటుంబసభ్యులు ఎవరిపైనా ఆరోపణలు చేయకపోవటం.. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించకపోవటంతో పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు