బాలికపై టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ

3 Nov, 2021 09:10 IST|Sakshi

నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  

సాక్షి, నాంపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం వట్టిమళ్ళ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకుడు అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన సంఘటన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం పరామర్శించేందుకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి ఘడియలో బాలిక ప్రాణాలు కాపాడే ప్రయత్నం జరిగిందని అన్నారు. స్థానిక ప్రజానీకం ఆందోళన చేస్తే తప్ప  ప్రభుత్వం స్పందించలేదన్నారు.

అభం శుభం తెలియని చిన్నారి బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖులు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులని మండిపడ్డారు. సిరిసిల్లలో సీఎంఓ ఒత్తిడి, మంత్రి ఒత్తిడితో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారే తప్ప, అత్యాచారానికి గురైన పాపను రక్షించాలనే సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఏమైనా చేసుకోవచ్చని, వీరు లైసెన్స్‌ కలిగిన గూండాలుగా మారారని సంజయ్‌ దుయ్యబట్టారు. సిరిసిల్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. వెంటనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


చదవండి: ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై..

కాగా.. సభ్య సమాజం తలదించుకునేలా ఓ బాధ్యతగల పదవిలోఉండి  చిన్నారిపై మృగంలా ప్రవర్తించిన ఆ నేత తీరు ఆది నుంచి వివాదస్పదమే.. అల్మాన్‌పూర్‌ గ్రామానికి చెందిన సర్పంచ్‌ భర్త, రైతుబంధు మండల అధ్యక్షుడు రాధారపు శంకర్‌(48) ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని కూడా కుదిపేసింది. గిరిజన బాలికపై అత్యాచారం చేసిన శంకర్‌ ప్రస్తుతం జైలులో ఊచలులెక్కిస్తున్నారు.

కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన గిరిజన దంపతులు ఉపాధి కోసం అల్మాన్‌పూర్‌కు వచ్చి అద్దె శంకర్‌కు చెంది న ఇంట్లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల చిన్నారి ఉంది. ఉద్యోగరిత్యా వీరు బయటకు వెళ్లగా.. స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన బాలిక శంకర్‌ ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికకు చాక్లెట్లు ఇస్తానంటూ గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజు అంనతరం కడుపులో నొప్పి వస్తుందంటూ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

సిరిసిల్ల ఘటనపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలి:  ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌  
నాంపల్లి: రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, సిరిసిల్ల ఘటనపై వెంటనే పాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూడాలని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నిలోఫర్‌ ఆసుపత్రిని సందర్శించిన ఆయన బాధిత బాలికను, తల్లిదండ్రులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్‌ భర్త ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణం అన్నారు. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన శంకర్‌పై అనేక ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు. నేర చరిత్ర కలిగిన నేతలను టీఆర్‌ఎస్‌ పారీ్టలో ఎలా చేర్చుకున్నారో తెలియదు కానీ, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.   

మరిన్ని వార్తలు