రూ.20 లక్షల కట్నం, ఘనంగా పెళ్లి.. ఏడాది తిరక్కముందే

29 Apr, 2022 17:40 IST|Sakshi
నిఖిత (ఫైల్‌), ఉదయ్‌ ఇంటి ముందు నిరసన తెలుపుతున్న నిఖిత కుటుంబీకులు, గ్రామస్తులు 

సాక్షి, సిరిసిల్ల: వరకట్నం వేధింపులకు నవ వధువు బలైంది. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోగా.. మృతదేహాన్ని కస్బెకట్కూర్‌కు తరలించారు. సిరిసిల్లలోని అబ్బాయి ఇంటి వద్ద అమ్మాయి కుటుంబీకులు, గ్రామస్తులు నిరసన తెలుపగా.. పోలీసులు బందోబస్తు చేపట్టారు. మృతురాలి పెద్దనాన్న జూపల్లి వేణుగోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటకు చెందిన చీటి ఉదయ్‌కు తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్‌కు చెందిన జూపల్లి నిఖితకు 11 నెలల క్రితం వివాహమైంది. రూ.20 లక్షల కట్నం, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అయిన ఉదయ్, నిఖితలు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఉదయ్‌ అదనపు కట్నం తేవాలని నిఖితను వేధించసాగాడు. తల్లిగారింటి వద్ద వ్యవసాయ భూమిలో నుంచి రెండెకరాలు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన నిఖిత హైదరాబాద్‌లో వారు ఉంటున్న ఇంట్లోనే గురువారం తెల్లవారుజామున ఉరేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
చదవండి: బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు

అంబులెన్స్‌ను కస్బెకట్కూర్‌ పంపించిన పోలీసులు
నిఖిత కుటుంబసభ్యులు ఆమె మృతదేహంతో హైదరాబాద్‌ నుంచి అంబులెన్స్‌లో బయలుదేరారు. సిరిసిల్లలోని నిఖిత అత్తగారింటి వద్ద ధర్నా చేస్తారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు తంగళ్లపల్లి మండలం జిల్లెల చెక్‌పోస్టు వద్ద అంబులెన్స్‌ను అడ్డుకొని, కస్బెకట్కూర్‌కు పంపించారు. మృతురాలి పెద్దనాన్న ఆధ్వర్యంలో పలు వు రు ముందుగానే ఉదయ్‌ ఇంటికి వెళ్లగా.. అప్పటికే తాళం వేసి, పరారయ్యారు. ఎలాంటి తప్పు చేయకుంటే ఇంట్లో ఎందుకు ఉండరని ప్రశ్నిస్తూ అక్కడే నిరసనకు దిగారు. అయితే మృతదేహం కస్బెకట్కూర్‌లో ఉండగా కుటుంబసభ్యుల్లో కొందరు సిరిసిల్లలో ఉదయ్‌ ఇంటి వద్దే ధర్నా చేస్తున్నారు.   

►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు