ఉరివేసుకుని కుమారుడి ఆత్మహత్య  

29 Mar, 2021 14:56 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : తల్లిదండ్రులు తరచూ గొడవపడుతున్నారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నాల గ్రామానికి చెందిన మక్కల విజయ్‌కుమార్‌ (25) తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కొంత కాలంగా హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నాడు. పెద్దమనుషులు సర్దిచెప్పడంతో ఇటీవలె తల్లితో సహా పొన్నాలకు వచ్చాడు.

పరిస్థితిలో మార్పు రాకపోగా తల్లిదండ్రుల మధ్య గొడవలు ఇంకా పెరగడంతో మనస్తాపం చెందిన విజయ్‌కుమార్‌ శనివారం అర్ధరాత్రి తన సోదరుడు ప్రభాకర్‌కు ఫోన్‌ చేసి చాలా బాధగా ఉందని చెప్పాడు. ఏదైనా ఉంటే మాట్లాడుకుందామని, ఇంటికి రావాలని నచ్చజెప్పినా వినకుండా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. శనివారం రాత్రి నుంచి విజయ్‌ కోసం గాలిస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం పొన్నాల నుంచి మర్పడగ వెళ్లే దారిలో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి అన్న ప్రభాకర్‌  ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్‌ ఎస్సై శంకర్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: బురిడీ మాష్టారు.. బండారం బట్టబయలు
‘మా కూతురి మెడపై ఉరివేసిన గుర్తులున్నాయి’

మరిన్ని వార్తలు