రాసలీలల వీడియో పోస్టయింది అక్కడినుంచే!

14 Mar, 2021 02:55 IST|Sakshi

కర్ణాటకలో సిట్‌ ముమ్మర దాడులు

సాక్షి, బెంగళూరు: బీజేపీ నేత, మాజీ మంత్రి రమేష్‌ జార్కిహొళి రాసలీలల వీడియోల కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీడీని ఎవరు, ఎక్కడ రూపొందించారు, సూత్రధారు లెవరు అనేది సిట్‌ తేల్చనుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బెంగళూరు రూరల్‌లోని విజయపుర పట్టణంలో ఉన్న బసవేశ్వర లేఔట్‌లో నివాసం ఉంటున్న సురేష్‌ శ్రవణ్‌ అలియాస్‌ పెయింటర్‌ సూరి ఇంటికి మూడు వాహనాల్లో పోలీసులు చేరుకుని సోదాలు చేశారు. కొన్ని సీడీలను, ఒక కంప్యూటర్‌ను సీజ్‌ చేశారు. శ్రవణ్‌ గదిలో క్షుణ్ణంగా వెతికారు. వారం రోజుల నుంచి శ్రవణ్‌ ఇంటికి రాకపోవడంతో అతని సోదరున్ని పట్టుకెళ్లారు. రాసలీలల సీడీని శ్రవణ్‌ ఇక్కడే తన కంప్యూటర్‌లో ఎడిటింగ్‌ చేయడంతో పాటు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడని పోలీసులు చెబుతున్నారు.

కానీ ఈ వీడియో యూట్యూబ్‌లో రష్యా నుంచి పోస్ట్‌ అయినట్లు ఉండగా, శ్రవణ్‌ ఖాతాను ఎవరో రష్యాలో హ్యాక్‌ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు తెలిపారు. అతని కంప్యూటర్‌ పాస్‌వర్డ్‌ ఓపెన్‌ కాకపోవడంతో దానినితో పాటు పలు సీడీలను, పెన్‌ డ్రైవ్‌లను, ఇంటి కొనుగోలు కోసం తీసిపెట్టుకున్న రూ. 25 లక్షల డీడీని పోలీసులు తీసుకెళ్లారు. తుమకూరు జిల్లా శిరా తాలూకాలో ఉన్న భునవనహళ్లి గ్రామంలో సీడీ సూత్రధారిగా ఆరోపణలున్న నరేష్‌ గౌడ ఇంట్లో సోదాలు చేశారు. అతడు లేకపోవడంతో భార్యను ప్రశ్నించి వెళ్లిపోయారు. సీడీలో కనిపించిన యువతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.  చదవండి: (సీడీ విషయం నాలుగు నెలల ముందే తెలుసు)

ఉద్యోగం పేరుతో మోసగించాడు
►మాజీ మంత్రి రాసలీలల కేసులో యువతి ఆరోపణ

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల సీడీలో కనిపించిన యువతి ఎట్టకేలకు నోరువిప్పింది. అజ్ఞాతంలో ఉన్న ఆమె శనివారం రాత్రి తాను మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. రమేశ్‌ జార్కిహొళి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చి తప్పాడని, పైగా ఆయనే సీడీని బయటకు విడుదల చేశారని ఆరోపించింది. వీడియోను ఎవరు, ఎలా చిత్రీకరించారో తనకు తెలియదని పేర్కొంది. ‘ఆ సీడీ విడుదలతో నా మాన, మర్యాదలకు భంగం కలిగింది. ఆ ఆవేదనతో మూడు, నాలుగుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను.  చదవండి: (కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు)

నా తల్లిదండ్రులు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించారు. నా వెనుక ఎవరూ లేరు. నాకు రాజకీయ మద్దతు కూడా లేదు. ఉద్యోగం ఇప్పిస్తా నని జార్కిహొళి మోసం చేశాడు’ అని ఆరోపిం చింది. తనకు రక్షణ కల్పించాలని రాష్ట్ర హోం మంత్రి బసవరాజు బొమ్మైని కోరింది. రాసలీలల సీడీ విడుదలైన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన బాధిత యువతి 11 రోజుల తర్వాత వీడియోను విడుదల చేసింది. కాగా, సీడీ కేసులో సిట్‌ పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. 

నాపై రాజకీయ కుట్ర 
రాసలీలల సీడీపై రమేశ్‌ జార్కిహొళి శనివారం బెంగళూరు సదాశివనగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన రాజకీయ జీవితాన్ని భంగ పరచాలని సదాశివనగరలోనే కుట్ర పన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. కుట్ర, మోసం ద్వారా ఒక నకిలీ సీడీని సృష్టించి మానసికంగా హింసించారని తెలిపారు. దీని వెనుక చాలా మంది హస్తం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.   చదవండి: (మంత్రి రాసలీలల వీడియోలు వైరల్‌)

మరిన్ని వార్తలు