పోలీసుల అదుపులో ‘సీతానగరం’ కేసు నిందితుడు! 

6 Aug, 2021 04:30 IST|Sakshi
వెంకటరెడ్డి (ఫైల్‌), షేర్‌ కృష్ణ (ఫైల్‌)

ప్రకాశం జిల్లాలో అరెస్ట్‌ చేసిన పోలీసులు  

రహస్యంగా విచారణ  

సాక్షి, అమరావతి బ్యూరో: సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితుడిని గుంటూరు అర్బన్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడు షేర్‌ కృష్ణానా? వెంకటరెడ్డా? అనేది తెలియాల్సి ఉంది. ఒంగోలులో తిష్టవేసిన పోలీసులు 30 రోజుల పాటు వివిధ వేషధారణలతో యాచకుల దగ్గర్నుంచి.. హిజ్రాలను, సమోసాలు అమ్ముకునే వారిని, రైల్వే ట్రాక్‌ల పక్కన చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ ఎట్టకేలకు ఒంగోలు ఫ్లై ఓవర్‌ కింద సేదదీరుతున్న నిందితుడిని పట్టుకున్నారు.

రెండో నిందితుడు కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం రావడంతో గుంటూరు అర్బన్‌ నుంచి వెళ్లిన పలు బృందాలు ఒంగోలు రైల్వే ట్రాక్‌లు, ఇతర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాయి. ఇద్దరు నిందితులూ కేటరింగ్‌ పనులు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో ఆ కోణంలో ఒంగోలు, చీరాల, బాపట్ల, అద్దంకి ప్రాంతాలతో పాటు, చెన్నై రైల్వే మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాల్లో బృందాలుగా ఏర్పడి అన్వేషిస్తున్నట్టు తెలిసింది.   

మరిన్ని వార్తలు