ఘోర ప్రమాదం: ఏడుగురి మృతి

30 Oct, 2020 11:09 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ  ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు  ఉన్నారు. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం పూర్తయిన తర్వాత తిరిగి వస్తూ వ్యాన్‌ ప్రమాదానికి గురైంది.

ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్‌ మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 17 మంది పెళ్లి బృందం ఉన్నారు. మృతులు శ్రీదేవి, శ్రీలక్ష్మి, భాను, ప్రసాద్‌, దొరగా పోలీసులు గుర్తించారు. వధువు.. స్వస్థలం రాజానగరం మండలం వెలుగుబంద కాగా, వరుడు స్వస్థలం గోకవరం మండలం  ఠాకూర్‌పాలెనికి చెందిన వారిగా గుర్తించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి..
పెళ్లి వ్యాన్‌ బోల్తా ఘటనపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదంపై గవర్నర్‌ దిగ్భ్రాంతి
తంటికొండ ప్రమాదంలో ఏడుగురు మృతి పట్ల ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు