-

లైంగిక దాడి: బిర్యాని తినిపించి.. మద్యం తాగించి..

1 Oct, 2021 03:35 IST|Sakshi

దళిత విద్యార్థినిపై లైంగిక దాడి

ఆరుగురిపై అట్రాసిటీ కేసు 

నిజామాబాద్‌ అర్బన్‌: దళిత విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తెలిపారు. సామూహిక అత్యాచారం కేసు వివరాలను గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. నిజామాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్‌కు, బాధిత విద్యార్థినితో పరిచయం ఉంది. మంగళవారం నవీన్, మరో ఇద్దరు కలసి ఆమెను తీసుకుని నగర శివారుతోపాటు అంకాపూర్‌ తదితర ప్రాంతాల్లో తిరిగారు.

అక్కడ  ఆమెకు బిర్యాని తినిపించడంతోపాటు మభ్యపెట్టి మద్యం తాగించారు. అర్ధరాత్రి నిజామాబాద్‌ బస్టాండ్‌ సమీపంలో మర మ్మతులో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెపై ఈ ముగ్గురు అత్యాచారం చేయగా, మరో ముగ్గురు వారికి సహకరించారు. అక్కడే ఎదురుగా ఉన్న షాపింగ్‌మాల్‌ సెక్యూరిటీ గార్డ్‌ గమనించి యువకులను ప్రశ్నించడంతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సెక్యూరిటీ గార్డు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో వారు పారిపోయారు.

పోలీసులు వచ్చి విద్యార్థినిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నవీన్‌తో పాటు గంజి చంద్రశేఖర్, తుమ్మ భానుప్రకాశ్, సిరిగాద చరణ్, షేక్‌ కరీం, పి.గంగాధర్‌ పాల్గొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇందులో ఐదుగురిని బుధవారం అరెస్టు చేయగా, ఒకరిని గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు