20 రోజుల్లో ఆరుగురు మృతి.. కారణం?

26 Dec, 2020 08:47 IST|Sakshi
ముప్పనపల్లిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డీఎంహెచ్‌ఓ అప్పయ్య

మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురు

ములుగు జిల్లా ముప్పనపల్లిలో కలకలం

కలుషిత నీరే కారణమై ఉండొచ్చు: డీఎంహెచ్‌ఓ  

సాక్షి, ములుగు: అంతుచిక్కని ఆరోగ్య సమస్యతో జనాలు మరణిస్తున్న సంఘటన ములుగు జిల్లాలో కలకలం రేపుతోంది. అసలేంటో తెలియని ఈ రోగం ఇప్పటికే ఒకే కాలనీకి చెందిన ఆరుగురి ప్రాణాలు బలి తీసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విస్మయపరుస్తోంది. జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి ఎస్సీ కాలనీలో 70 కుటుంబాలు ఉండగా, 20 రోజుల వ్యవధిలో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ముందు రోజు జ్వరానికి గురైన వీరంతా కేవలం రెండ్రోజుల్లోనే కడుపు ఉబ్బి చనిపోయారు. ఇప్పటి వరకూ వీరి మరణాలకు కారణాలేంటో తెలియరావట్లేదు. కాలనీకి చెందిన వారు ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతుండటంతో మిగతా కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే, కలుషిత నీరే కారణమై ఉండొచ్చని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అనుమానం వ్యక్తం చేశారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, 72 మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని వార్తలు