ప్రేమ పేరుతో వేధింపులు..ఆపై బెదిరించి బాలికపై అత్యాచారం

26 Jul, 2021 08:45 IST|Sakshi

సాక్షి,సైదాబాద్‌( హైదరాబాద్‌): ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకుని బాలికను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాంకాలనీలో నివసించే కుటుంబం కులవృత్తి చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నారు. ఈనెల 3న తల్లిదండ్రులు ఏలూరులోని చుట్టాల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు.

ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని..
ఇంట్లో వారిద్దరి కూతుళ్లకు తోడుగా తమ బంధువైన ఓ బాలికను తోడుగా ఉంచారు. వారి పెద్ద కూతురు(16)కు సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆరు నెలలుగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. బాలికల ఇంట్లో పెద్దలు ఎవరూ లేరని తెలుసుకున్న అతను ఈనెల 5న రాత్రి వారింట్లోకి చొరబడ్డాడు. ఆ బాలికకు తోడుగా ఉన్న ఇద్దరు పిల్లలను అరిస్తే చంపుతానని బెదిరించాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడి తెల్లవారు జామున ఇంటి నుంచి పారిపోయాడు. ఈనెల 6న ఇంటికి తిరిగివచ్చిన తల్లిదండ్రులు భయంతో ఉన్న బాలికలను అడిగినా ఏమి చెప్పలేదు.

ఈనెల 12న మనస్తాపంతో ఆ బాలిక ఇంట్లోని శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స చేయించి తీసుకొచ్చిన తల్లి చుట్టాల అబ్బాయి ద్వారా కూపీ లాగింది. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తెలిపింది. వెంటనే బాలిక తల్లి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు