కాసుల ఎర.. అమాయకుల చెర
నిరుద్యోగులను బలి చేస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలు
దుబాయ్, నేపాల్ జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ యువకులు
కోరుట్ల: చిన్నాచితకా పనులు చేసుకుంటూ డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న నిరుపేద యువకులను బంగారం స్మగ్లింగ్ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నాందేడ్కు చెందిన కొందరు ముంబై, దుబాయ్ గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలు ఏర్పరచుకుని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన యువతకు డబ్బు ఎరవేసి బంగారం స్మగ్లింగ్ కోసం వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. కొందరికి నేరుగా బంగారం తీసుకురావాలని చెబుతుండగా, మరికొందరికి ఓ పార్సిల్ తీసుకురావాలని నమ్మబలుకుతున్నారు. కాసుల ఆశకు దుబాయ్ వెళ్తున్న యువకులు.. దుబాయ్, హైదరాబాద్, నేపాల్ ఎయిర్పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో దొరికిపోయి జైల్లో మగ్గుతున్నారు. తాము దుబాయ్ పంపిన వారిలో ఎవరైనా కస్టమ్స్ తనిఖీల్లో దొరికిపోతే.. ఆ ముఠా సభ్యులు వెంటనే తమ మకాం వేరే చోటికి మార్చుతున్నారు.
కిలోకు రూ.5 లక్షలు తేడా..
మనదేశంలో బంగారం ధరలతో పోల్చితే.. దుబాయ్లో తులానికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కిలో బంగారం ఇండియాకు చేరవేస్తే రూ.5 లక్షల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ సంపాదనకు ఆశపడ్డ స్మగ్లర్లు అమాయకులకు కాసులు ఎరవేస్తున్నారు. ఈ ముఠాలపై నిఘాపెట్టి అమాయకులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.