ఒకేసారి ఇద్దరితో వివాహిత వివాహేతర సంబంధం.. ఐటీ ఉద్యోగి దారుణహత్య

27 Jul, 2022 11:30 IST|Sakshi

తోట్లవల్లూరు (కృష్ణా జిల్లా) : వివాహేతర సంబంధం కారణంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్యకు గురైన ఘటన తోట్లవల్లూరు మండలంలోని చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో జరిగింది. చిమ్మచీకట్లో తెల్లవారుజామున జరిగిన ఈ ఘాతుకంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో యాకమూరుకు చెందిన గాడికొయ్య శ్రీనివాసరెడ్డి(38) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యాకమూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీనివాసరెడ్డి భద్రిరాజుపాలెంకు చెందిన ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి స్నేహితులు. ఇరువురూ బాగా చనువుగా ఉండటంతో పాటు ఒకరింటికి ఒకరు పరస్పరం వచ్చి వెళుతుంటారు. 

వర్క్‌ ఫ్రం హోంలో భాగంగా శ్రీనివాసరెడ్డి యాకమూరులోని ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీకాంత్‌రెడ్డి గ్రామంలోనే వ్యవసాయం చేస్తుంటాడు. చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంకు చెందిన ఆళ్ల మిధున అలియాస్‌ జ్యోతితో గత కొన్నేళ్లుగా శ్రీకాంత్‌రెడ్డి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. జ్యోతి భర్త అమాయకంగా ఉంటాడు. దానిని ఆసరాగా తీసుకుని ఆమె శ్రీకాంత్‌రెడ్డితోనే కాకుండా కొంతకాలంగా శ్రీనివాసరెడ్డితో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.

 ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి యాకమూరులోని ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌ తీసుకుని పునాదిపాడు స్నేహితుల ఇంటికి వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చిన శ్రీనివాసరెడ్డి ఆళ్లవారిపాలెంలోని మిధున ఇంటి వరండాలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రదేశంలో గొడ్డలి, కత్తి లభ్యమయ్యాయి. రక్తపుమడుగులో పడి ఉన్న శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ సత్యానందం, పమిడిముక్కల సీఐ ముక్తేశ్వరరావు, ఎస్‌ఐ అర్జున్‌ ఘటనా ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.

 హత్యకు కారకులుగా భావిస్తున్న ఆళ్ల శ్రీకాంతరెడ్డి, ఆళ్ల మిధున, ఆమె పదినెలల పాపతో కలిసి పరారయ్యారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్‌ టీంలను రంగంలోకి దింపి పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఎస్‌ఐ అర్జున్‌ తెలియజేశారు.  

మరిన్ని వార్తలు