'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

24 Aug, 2021 07:39 IST|Sakshi
విశాల్‌ (ఫైల్‌)

ప్రేమ విఫలం

40 నిమిషాల సెల్ఫీ వీడియో లభ్యం

అమీర్‌పేట: ‘నిన్ను మనసారా ప్రేమించాను. నీవు నాకు దూరమవుతున్నావన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నీవు లేకుండా నేను బతకలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూసింది. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన నీరజ్‌కుమార్‌ కుటుంబం మధురానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వీరి కుమారుడు కె.విశాల్‌ (26)ఓ యువతిని ప్రేమిచాడు. 

చదవండి: సెంట్రల్‌ యూనివర్సీటిలో పీజీ విద్యార్థిని ఆత్మహత్య

అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక..
వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించకపోగా ఇటీవలే యువతికి వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి భోజనం చేశాక ఎప్పటిలాగే తన గదిలో పడుకున్నాడు. ఉదయం 5 గంటల సమయంలో తండ్రి నీరజ్‌ వెళ్లి విశాల్‌ను లేపేందుకు ప్రయతి్నంచాడు. ఎలాంటి చలనం లేకపోడంతో వెంటనే అమీర్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు విశాల్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ జరిపారు. 

సెనైడ్‌ ఎలా వచ్చింది?
సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. తాను అమితంగా ప్రేమించిన యువతి తనకు దక్కడం లేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని 40 నిమిషాల వీడియో తీసుకున్నాడు. గదిలోని ఓ సీసాలో సెనైడ్‌ ఉంది. దాన్ని ముట్టుకోవద్దని రాసిపెట్టి బెడ్‌ కింద ఉంచిన కాగితాన్ని స్వాధీనం చేసుకున్నారు. విశాల్‌ సెనైడ్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే విశాల్‌కు సెనైడ్‌ ఎలా వచ్చింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.  

చదవండి: నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మరిన్ని వార్తలు