మద్యమత్తులో కన్నతల్లి పైనే కాల్పులు జరిపిన కసాయి కొడుకు!

10 Jul, 2022 14:48 IST|Sakshi

మద్యపానం ఎన్నో కుటుంబాలను కార్చిచ్చులా కాల్చేస్తోంది. ఎన్నో జీవితాలు ఈ మద్యపానం కారణంగా నాశనమైయ్యాయి. ఆఖరికి ఎడిక్షన్‌ సెంటర్లు సైతం ఇలా మద్యపానానికి బానిసైన వాళ్లను మార్చేందుకు ముందుకు వచ్చినప్పటికీ... ఇంకా చాలాచోట్ల యువత పెడదోవపట్టి ఈ తాగుడు మహమ్మారికి బానిసై భావి జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి మద్యానికి బానిసై దారుణమైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు.


వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని ఒక వ్యక్తి మద్యం మత్తులో కన్నతల్లినే హతమార్చాడు. ఈ ఘటన చౌవియా ప్రాంతంలోని నాగ్లా మర్దాన్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మద్యం మత్తులో ఉన్న శివ ప్రతాప్‌ అనే వ్యక్తి దేశీయ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపాడు. ఐతే ప్రమాదవశాత్తు ఒక బుల్లెట్టు అతని కన్నతల్లి శరీరంలోకి దూసుకపోయింది.

దీంతో అక్కడికక్కడే అతని తల్లి ఊర్మిళా దేవి కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటన అనంతరం నిందుతుడు శివప్రతాప్‌ పరారయ్యినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు