ఆస్తి పంచలేదని తల్లినే చంపేశాడు! 

3 Jul, 2022 03:05 IST|Sakshi
 గుట్ట కర్రెమ్మ 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘటన 

మహమ్మదాబాద్‌: ఆస్తి పంచివ్వలేదనే కోపంతో కన్నతల్లినే కడతేర్చాడు ఓ దుర్మార్గుడు. బండరాయితో తల్లి తలపై మోది హత్య చేసిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మహమ్మదాబాద్‌ మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన గుట్ట కర్రెమ్మ(68), వెంకటయ్య దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరందరికీ వివాహాలు చేశారు.

కాగా, కర్రెమ్మ, వెంకటయ్యల పేరు మీద ఉన్న నాలున్నర ఎకరాల భూమిని తమకు పంచి ఇవ్వాలని కుమారులు కొంతకాలంగా గొడవపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా మరోసారి ఇంట్లో ఘర్షణ జరిగింది. ఈ విషయమై పెద్ద కుమారుడు పండరయ్య గట్టిగా నిలదీయగా మాటామాట పెరిగిపోయింది. కోపంతో ఊగిపోయిన పండరయ్య ఇంటి ముందు కూర్చున్న తల్లి తలపై బండరాయితో గట్టిగా కొట్టాడు.

ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు పండరయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు