మామ చేతిలో అల్లుడు దారుణహత్య

31 Jan, 2021 21:30 IST|Sakshi

హైదరాబాద్‌: పిల్లనిచ్చిన మామ చేతిలో అల్లుడు దారుణహత్యకు గురైన ఘటన ఆదివారం రాయదుర్గంలో చోటుచేసుకుంది. వివరాలు.. టోలిచౌకీకి చెందిన షేక్‌ సల్మాన్‌(20) మణికొండలో బ్లాక్‌బర్డ్‌ బ్యూటీ పేరుతో టైలర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా గోల్కొండలోని అక్బర్‌పురలో నివసిస్తున్న ఫరహాన అనే మహిళతో 2019లో షేక్‌ సల్మాన్‌కు వివాహమైంది. కొంతకాలం వీరిద్దరు బాగానే ఉన్నా.. గత 7 నెలల నుంచి సల్మాన్‌ భార్యను శారీరకంగా హింసకు గురి చేయడమేగాక తీవ్రంగా కొట్టేవాడు. దీంతో ఫరహాన తండ్రికి విషయం చెప్పడంతో సల్మాన్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే సల్మాన్‌ వారి మాటలను పట్టించుకోకుండా ఫరహానను మరింతగా హింసించడం మొదలుపెట్టాడు.

దీంతో సల్మాన్‌ను అంతమొందించాలని భావించిన అతని మామ తన బంధువులతో కలిసి మణికొండ ఏరియాలోని అతని టైలర్‌ షాపు వద్దే కిడ్నాప్‌ చేశాడు. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నక్కలపల్లి చెరువు వద్దకు తీసుకెళ్లి సల్మాన్‌ గొంతుకు వైరు బిగించి.. తలపై బండరాయితో మోది హత్యకు పాల్పడ్డాడు. కాగా షేక్‌ సల్మాన్‌ కనిపించడం లేదని అతని తరపు బంధువులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నక్కలపల్లి చెరువు వద్ద శవంగా కనిపించిన వ్యక్తి సల్మానే అని నిర్థారణకు వచ్చి బంధువులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు