అత్తను హతమార్చిన అల్లుడు 

27 Feb, 2021 08:31 IST|Sakshi
లొంగిపోయిన మహబూబ్‌బాషా  

బుక్కరాయసముద్రం(అనంతపురం జిల్లా): మాటామాట పెరగడంతో ఓ వ్యక్తి తన అత్తపై కొడవలితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన శుక్రవారం చెన్నంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... చెన్నంపల్లి గ్రామానికి చెందిన హుసేన్‌బీ(55) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహాలయ్యాయి. రెండో కుమార్తె షేకున్‌బీని నార్పలకు చెందిన మహబూబ్‌బాషాకిచ్చి పదేళ్ల క్రితం పెళ్లి చేసింది. అయితే మద్యానికి బానిసైన మహబూబ్‌బాషా రోజూ భార్యను వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో వేధింపులు ఎక్కువ కావడంతో రెండురోజుల క్రితం హుసేన్‌బీ తన కూతురు షేకున్‌బీని చెన్నంపల్లికి తీసుకువచ్చింది.

శుక్రవారం సాయంత్రం పూటుగా మద్యం తాగి చెన్నంపల్లికి వచ్చిన అల్లుడు మహబూబ్‌బాషా తన భార్యను పంపాలని హుసేన్‌బీతో గొడవకు దిగాడు. మాటామాట పెరగడంతో వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో హుసేన్‌బీ తలకు, చేతులకు గాయాలు కాగా తీవ్ర రక్తస్రావమైంది. అక్కడి నుంచి పరారైన మహబూబ్‌బాషా నేరుగా నార్పల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కొన ఊపిరితో ఉన్న హుసేన్‌బీని స్థానికులు 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది. నార్పల పోలీసులు నిందితున్ని బుక్కరాయసముద్రం పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌ 
కనిపించని తమ్ముళ్లు.. టీడీపీ డీలా!

 

మరిన్ని వార్తలు