సోదరి పెళ్లికి కట్నం ఎక్కువ ఇస్తోందని..!

6 Mar, 2021 11:40 IST|Sakshi
విలపిస్తున్న కుమార్తె, బంధువులు

రోకలి బండతో కొట్టి తల్లిని చంపిన కుమారుడు

సోదరి పెళ్లికి కట్నకానుకలు ఎక్కువ ఇస్తోందని తల్లిపై కోపం  

బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా): చెల్లిలి వివాహాన్ని అడ్డుకునేందుకు తల్లిని రోకలి బండతో కిరాతకంగా కొట్టి చంపాడో కొడుకు. ఈ సంఘటన మండలంలోని ఖాజీపురంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. గ్రామంలోని పూనూరు పెద్ద వెంకటరెడ్డి, ఆశ కార్యకర్త అరుణ (45) దంపతులకు మానసిక వికలాంగుడైన హరీష్‌కుమార్‌రెడ్డి, బీఫార్మసీ చదువుతున్న కళ్యాణి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కళ్యాణికి పెళ్లి సంబంధం చూశారు. పది రోజులుగా ఉన్న డబ్బులన్నీ చెల్లెలు వివాహానికి ఖర్చు పెడితే తనకు ఏమీ మిగలదని, ఎవరో ఒకరిని చంపుతానని బెదిరిస్తూ ఉన్నాడు కొడుకు.

తండ్రి పొలానికి వెళ్లిన సమయంలో తల్లి అరుణ ఇంట్లో ఒంటరిగా ఆదమరిచి పనులు చేసుంటోంది. ఆ సమయంలో రోకలిబండ తీసుకుని తల్లి తలపై హరీష్‌కుమార్‌రెడ్డి కొట్టాడు. బలంగా పలుమార్లు కొట్టడంతో తలపగిలి గట్టిగా కేకలు పెడుతూ అక్కడికక్కడే పడిపోయింది. స్థానికులు గమనించిన చుట్టు పక్కల వారు భర్తకు సమాచారం ఇవ్వడంతో తీవ్రంగా గాయపడిన అరుణను ఆటోలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గం మధ్యలోనే అరుణ మృత్యువాత పడింది. ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి అనారోగ్యం ఒకవైపు, కుటుంబానికి అన్నీ విధాలుగా అండగా ఉన్న తల్లి మరణంతో తనకు ఇక దిక్కెవరంటూ కుమార్తె భోరున విలపిస్తోంది.
చదవండి:
భార్యను చంపేసి.. ఏమీ ఎరగనట్టు..!  
కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది..

మరిన్ని వార్తలు