యాదాద్రి జిల్లాలో షాకింగ్‌ ఘటన.. కన్న తండ్రినే దారుణంగా..

21 Nov, 2022 07:32 IST|Sakshi

ఆలేరు రూరల్‌ (యాదాద్రి జిల్లా): మద్యం తాగి హింసిస్తున్నాడని తండ్రిని ఇద్దరు కొడుకులు కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేసిన అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా,, ఆలేరు మండలంలోని తూర్పుగూడెం గ్రామానికి చెందిన తిప్పాబత్తిని భాస్కర్‌ (45), కరుణారాణి దంపతులకు తరుణ్, బాలతేజ సంతానం. కొడుకులిద్దరూ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. కొంతకాలంగా భాస్కర్‌ మద్యానికి బానిసగా మారి భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.

కాగా, హైదరాబాద్‌లో ఉంటున్న కుమారులిద్దరూ మినీ క్రిస్మస్‌ జరుపుకునేందుకు శనివారం స్వగ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి భాస్కర్‌ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడగా అడ్డొచ్చిన ఇద్దరు కుమారులను సైతం కర్రతో బాదాడు. ఆదివారం ఉదయం కూడా ఇదే మాదిరి గొడవ జరగడంతో కుమారుల ఆగహ్రం కట్టలు తెచ్చుకుంది. దీంతో ఇద్దరు కొడుకుల్లో ఒకరు తండ్రిని గట్టిగా పట్టుకోగా మరొకరు ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని గొంతులో పొడిచాడు.

అనంతరం ఛాతిలో బలంగా మరోమారు పొడవడంతో భాస్కర్‌ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. సమాచారం మేరకు ఎస్‌ఐలు ఇద్రిస్‌ అలీ, వెంకటశ్రీను ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఇద్దరు నిందితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.
చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. పెళ్లైన మహిళతో ఎఫైర్‌.. వీడియో కాల్స్‌ అడ్డం పెట్టుకొని..

మరిన్ని వార్తలు