ప్రాణం తీసిన అతివేగం

4 Jul, 2021 22:04 IST|Sakshi

చంద్రగిరి: అతివేగం కారణంగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని మదనపల్లె–తిరుపతి జాతీయ రహదారిపై నాగయ్యగారిపల్లె వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి సప్తగిరినగర్‌కు చెందిన ఢిల్లీశ్రీనివాసులు తన సోదరి హిమబిందుతో పాటు చిన్నారులు విష్ణుప్రియ, మధురిమ(ఏడాదిన్నర వయస్సు), చినాన్న కిషోర్, సమీప బంధువు బసవమ్మ(60)తో కలసి కడప జిల్లా సుండుపల్లెకి మారుతి కారులో తిరుపతి నుంచి పయనమయ్యారు. నాగయ్యగారిపల్లె వద్ద కారు అదుపు తప్పడంతో, డ్రైవరు ఢిల్లీ శ్రీనివాసులు రహదారికి ఆనుకుని ఉన్న ఓ మామిడితోటలోకి కారు పోనిచ్చే క్రమంలో చెట్టును ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో బసవమ్మతో పాటు ఏడాదిన్న వయస్సు ఉన్న చిన్నారి మధురిమకు తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ శ్రీనివాసులు, కిషోర్, హిమబిందు, విష్ణుప్రియ స్వల్పంగా గా యపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. బసవమ్మ మార్గంమధ్యలో మృతి చెందింది. రుయా లో చికిత్సకు చేరిన తరువాత చిన్నారి మధురిమ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు వేలూ రు సీఎంసీకి తరలించేందుకు యత్నించా రు. మార్గం మధ్యలో చిన్నారి కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలను పరిశీలించారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు