ఆ నిండు ప్రాణాలు పోవడానికి కారణం అదే!

15 Apr, 2021 21:30 IST|Sakshi

తిరుత్తణి: బైకును, కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రీ కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన తిరుత్తణి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని మురుక్కంపట్టు గ్రామానికి చెందిన లోకనాథన్‌(42) ప్రభుత్వ బస్సు కండెక్టర్‌. మంగళవారం రాత్రి తిరుత్తణి నుంచి గ్రామానికి బైకులో తండ్రి దేశప్పరెడ్డితో కలిసి వెళ్తుండగా చెన్నై – తిరుపతి జాతీయ రహదారి మురుక్కంపట్టు వద్ద తిరుపతి నుంచి తిరుత్తణి వైపు వేగంగా వెళ్తున్న కారు బైకును ఢీకొంది.

ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న తండ్రీ కొడుకులిద్దరూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్‌ పరారయ్యాడు. అయితే తమ గ్రామం వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోక పోవడంతోనే రెండు ప్రాణాలు పోయాయని, వెంటనే కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేయాలని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై–తిరుపతి జాతీయ రహదారిలో దాదాపు రెండు గంటల పాటు వాహన రాకపోకలు స్తంభించాయి. పోలీసుల హామీతో గ్రామస్తులు ధర్నా విరమించారు.

మరిన్ని వార్తలు