వాట్సాప్‌ మెసేజ్‌: సారీ డాడీ.. ఎలా చెప్పాలో తెలియట్లేదు..

29 Jun, 2021 18:33 IST|Sakshi

వాట్సాప్‌ మెసేజ్‌ పంపి యువకుడి ఆత్మహత్య

తండ్రి వీడియో గేమ్స్‌ ఆడొద్దని చెప్పడమే కారణం

మృతుడు జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌లో వీడియో గేమ్స్‌ ఆడొద్దని తండ్రి మందలించాడని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అంతకు ముందు ‘సారీ.. డాడీ’ అంటూ తండ్రి కి వాట్సాప్‌ సందేశం పంపాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఉప్పుగల్లుకు చెందిన కోరు కొప్పుల రాజు, అనిత దంపతుల కుమారుడు శ్రీచరణ్‌గౌడ్‌ పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి వద్దే ఉంటున్న శ్రీచరణ్‌ ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుండటంతో తండ్రి ఆదివారం మందలించాడు. మనస్తాపానికి గురైన శ్రీచరణ్‌ ఆదివారం రాత్రి భోజనం చేశాక కుటుంబసభ్యులు నిద్రపోయే వరకు ఉండి, రాత్రి 11 గంటలకు బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్‌ వెళ్లాడు. 12.54 గంటలకు తండ్రి ఫోన్‌కు ‘ఐయామ్‌ వెరీ సారీ డాడీ.. అమ్మ, చెల్లెను బాగా చూసుకో’అని వాట్సాప్‌ మెస్సేజ్‌ పంపాడు.

రాత్రి 1.10 గంటలకు ‘ఐయామ్‌ వెరీవెరీ సారీ డాడీ.. నా సమస్యను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. డాడీ, మమ్మీ, చెల్లి మేఘీ ఐ మిస్‌ యూ’అంటూ మరోసారి మెసేజ్‌ పంపాడు. రాత్రి 1.15 గంటలకు రైల్వేస్టేషన్‌ లొకేషన్‌ షేర్‌ చేశాడు. నిద్రలో ఉండటంతో ఎవరూ చూడలేదు. రాత్రి 1.20 గంటలకు ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం సెల్‌లో మెస్సేజ్‌లు చూసిన రాజు హుటాహుటిన ఘన్‌పూర్‌కు వెళ్లే సరికి కుమారుడి తల, మొండెం విడిపోయి విగతజీవుడై పడి ఉండటంతో బోరున విలపించాడు.
(చదవండి: రేఖ హత్య: సూత్రధారి మాలా.. ఎన్నికల కోసమేనా?!)

మరిన్ని వార్తలు