పుట్టిన రోజు జరుపుకోవడానికి వచ్చి తిరిగిరాని లోకానికి.. 

1 Aug, 2021 15:44 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: రావివలస గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం లారీ ఢీకొని పిలక రమణ మృతి చెందగా.. చాట్ల గోవింద గాయపడ్డాడు. ఎచ్చెర్ల మండలం కొత్తకూరి్మనాయుడుపేట గ్రామానికి చెందిన రమణ, చినఅజ్జరాం గ్రామానికి చెందిన గోవింద్‌లు విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని తిమ్మాపురంలో ఉంటూ ఆటోలు నడుపుకుంటున్నారు. జూలై 30వ తేదీన రమణ పుట్టిన రోజు కావడంతో స్వగ్రామం కొత్తకూరి్మనాయుడుపేటలో స్నేహితులతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి స్నేహితుడు గోవింద్‌ను తీసుకొని వచ్చాడు.

పుట్టిన రోజు వేడుకలు అయిపోవడంతో శనివారం సాయంత్రం తిమ్మాపురం వెళ్లేందుకు రమణ, గోవింద్‌లు స్కూటీతో వెళ్తూ రావివలస సమీపంలో లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదే లారీ ఢీకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రమణ లారీ చక్రాల కింద పడిపోవడంతో తలకు తీవ్ర గ్రాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గోవింద్‌ను 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. లావేరు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. రమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రమణకు 2019వ సంవత్సరంలో వివాహమైంది. భార్య కుమారి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి.

మరిన్ని వార్తలు