డాక్టర్‌‌ నమ్రతతో పాటు మరో ఇద్దరు వైద్యుల అరెస్ట్‌

6 Aug, 2020 17:54 IST|Sakshi
నర్సు నూకరత్నం, డాక్టర్‌ పద్మజ

సాక్షి, విశాఖపట్నం: సరోగసి ముసుగులో చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న సృష్టి ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ నమ్రత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు నమ్రతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పలు కీలకాంశాలు తెలిసాయని సీపీ ఆర్కే మీనా తెలిపారు. గత మూడేళ్లలో సృష్టి ఆస్పత్రిలో 63 సరోగసి డెలివరీలు జరిగాయని వెల్లడించారు. చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించి మరిన్ని కేసులు నమోదు అవుతున్నాయన్నారు. తాజాగా ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో మరో చిన్నారి అక్రమ రవాణా కేసు నమోదయినట్లు తెలిపారు. డాక్టర్‌ నమ్రత, పద్మజ ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. ఈ క్రమంలో చోడవరానికి చెందిన ఓ మహిళ దగ్గర నుంచి డాక్టర్‌ నమ్రత 13 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందన్నారు. 

అంతేకాక మరో గర్బిణీ మహిళ వెంకటలక్ష్మి చోడవరంలోని జగ్గారావు ఆస్పత్రికి చెక్‌అప్‌ కోసం వెళ్లారు. ఈ క్రమంలో సృష్టి ఆస్పత్రి ఏజెంట్లు తమ ఆస్పత్రిలో ఉచితంగా డెలివరీ చేస్తారని ఆమెను నమ్మించారని సీపీ ఆర్కే మీనా తెలిపారు. ఆ తర్వాత సృష్టిలో చేరిన వెంకటలక్ష్మిని డెలివరీ కోసం పద్మజ ఆస్పత్రికి పంపి.. అక్కడే పురుడు పోశారన్నారు. అనంతరం బిడ్డ చనిపోయినట్లుగా ఆమెకు చూపించారన్నారు. ఆ తర్వాత అదే బిడ్డను మరొకరికి సరోగసీ పేరుతో అమ్మేసారని తెలిపారు. ఈ కేసులో డాక్టర్‌ నమ్రత, పద్మజలతో పాటు మరో మహిళా డాక్టర్‌తో పాటు ఏజెంట్‌గా వ్యవహరించిన నర్సు నూకరత్నం అరెస్ట్‌ చేశామన్నారు. సృష్టి ఆస్పత్రిపై అనేక ఆరోపణలున్నాయని లోతుగా విచారిస్తున్నామని సీపీ ఆర్కే మీనా తెలిపారు. 

మరిన్ని వార్తలు