వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల రాళ్ల దాడి

4 Apr, 2021 04:16 IST|Sakshi
రాళ్ల దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులు

ఇద్దరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

వినుకొండ: గుంటూరు జిల్లాలో సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం సందర్భంగా టీడీపీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్ల దాడి చేశారు. జిల్లాలోని వినుకొండ రూరల్‌ మండలం నడిగడ్డ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బొగిరి చినకోటేశ్వరరావు సర్పంచ్‌గా ఎన్నికైన తన వదిన ప్రమాణస్వీకారం సందర్భంగా గ్రామంలోని ప్రధాన సెంటర్‌కు రాగా, ఆయనపై టీడీపీ వర్గీయులైన పూర్ణి చినలింగారావు, నంబుల ఆదినారాయణ, శ్రీను, యరబోతుల శివ, సత్యం దాడి చేశారు.

వీరిని అడ్డుకున్న పోగుల కోటయ్యపై కత్తితో దాడి చేసి గాయపరిచారు. దీంతో వారు ప్రాణభయంతో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బెల్లం శివ ఇంటి వద్దకు వెళ్లగా, టీడీపీ వర్గీయులు ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై కూడా రాళ్ల దాడి చేశారు. ఇంతలో ఘటనా స్థలానికి పోలీసులు రావడంతో టీడీపీ వర్గీయులు పరారయ్యారు. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు