‘మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలుసు.. నాకు బతకాలని లేదు’

2 Nov, 2022 08:48 IST|Sakshi

కొండాపురం(నెల్లూరు జిల్లా): ‘నాకు బతకాలని లేదు’ అంటూ ఓ విద్యార్థి సొంత తమ్ముడు, మరికొందరికి మెసేజ్‌ పెట్టి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చింతలదేవి పంచాయతీ తూర్పు బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కొండాపురం ఎస్సై ఎస్‌కే ఖాజావలీ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నీలపాటి శ్రీరాములు, రాజేశ్వరి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. వారికి అజయ్‌ (20), విజయ్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరూ బంధువులతో కలిసి నెల్లూరులో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్‌ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
చదవండి: మామయ్య ఇంటికి వచ్చిన ఖమ్మం యువతి.. షాపింగ్‌ చేస్తుండగా యువకుడు షాకింగ్‌ ట్విస్ట్‌..

అజయ్‌ డిగ్రీ ఫైనలియర్, విజయ్‌ ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్నారు. పెద్దవాడైన అజయ్‌ ఆదివారం స్వగ్రామమైన తూర్పు బ్రాహ్మణపల్లికి వచ్చి అత్త అంకమ్మ ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి ప్రాజెక్ట్‌ వర్క్‌ ఉందని అత్తకు చెప్పి తన సొంత ఇంటికి వెళ్లాడు.

అక్కడి నుంచి తన సెల్‌ఫోన్‌ ద్వారా తమ్ముడు విజయ్, బంధువులు, మరికొంతమంది స్నేహితులకు ‘నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలుసు. నాకు బతకాలని లేదు. చనిపోతున్నా..’ అంటూ వాట్సాప్‌లో మెసేజ్‌ చేశాడు.

మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో తమ్ముడు విజయ్‌ మెసేజ్‌ చూసి గ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందజేశాడు. వారు అజయ్‌ ఇంటికి వెళ్లి తలుపులు తెరిచారు. అప్పటికే అతను ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులకు సమాచారం వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించామని ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు