కష్టపడి ఎస్‌ఐ అయ్యాడు.. పెళ్లయి కూడా 5 రోజులే.. విధుల్లో చేరేందుకు వెళ్తూ..

2 Jan, 2022 03:08 IST|Sakshi
శ్రీను (ఫైల్‌) 

చింతపల్లి: కష్టపడి చదివి ఎస్‌ఐ ఉద్యోగం సాధించి శిక్షణ పూర్తి చేసుకున్నాడు. 5 రోజు ల క్రితమే పెళ్లి అయ్యింది. ఉద్యోగంలో చేరి సాఫీగా జీవితం గడపాలనుకున్న అతడిని విధి వెక్కిరించింది. విధుల్లో చేరడానికి స్వ గ్రామం నుంచి తండ్రితో కలసి బయలుదేరగా.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లిరాంనగర్‌ సమీపంలో సాగర్‌ హైవేపై శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. చింతపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం మాన్యతండాకు చెందిన నేనావత్‌ మాన్యనాయక్‌(50)ది వ్యవసాయ కుటుంబం.

ఇతని కుమారుడు నేనావత్‌ శ్రీను(30) ఎస్‌ఐగా శిక్షణ పూర్తి చేసుకొని వికారాబాద్‌ టౌన్‌కు పోస్టింగ్‌ అందుకున్నా డు. శనివారం పలువురు కుటుంబసభ్యుల తో కలసి ఆటోలో మాన్యతండా నుం చి హైదరాబాద్‌కు తండ్రీకొడుకులు బయల్దేరారు. హైదరాబాద్‌ నుంచి మల్లేపల్లి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పోలేపల్లిరాంనగర్‌ వద్ద ఆటోను ఢీకొట్టింది.

శ్రీను, మాన్యనాయక్‌ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, నాంపల్లి సీఐ సత్యం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా, శ్రీనుకు వికారాబాద్‌ టౌన్‌ ఎస్‌ఐగా పోస్టింగ్‌ రావడంతో రిపోర్ట్‌ చేయాల్సి ఉంది. పెళ్లి తంతు ముగిసిన అనంతరం విధుల్లో చేరాలని భావించాడు. ఎస్‌ఐగా రిపోర్ట్‌ చేసేందుకు వెళ్తూనే మృతిచెందాడు.  

పెళ్లయిన ఐదు రోజులకే.. 
నేనావత్‌ శ్రీను వివాహం మాల్‌ వెంకటేశ్వరనగర్‌లో ఐదు రోజుల క్రితం జరిగింది. పోలీసు శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగం సాధించడంతో కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలని పెళ్లి చేసుకున్నాడు. అంతలోనే మృత్యువు కబళించింది. 

మరిన్ని వార్తలు