కొడుకు హత్యకు తండ్రి సుపారీ

6 Dec, 2022 08:51 IST|Sakshi

సాక్షి, హుబ్లీ: నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారి భరత్‌ జైన్‌ కుమారుడు అఖిల్‌జైన్‌ మిస్సింగ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. సాక్షాత్తూ తండ్రే కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకొని కుమారున్ని హత్య చేయాలని సుపారీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

1న మిస్సింగ్‌ అని ఫిర్యాదు  
వివరాలు.. అఖిల్‌ జైన్‌ ఈ నెల 1 నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు కేశ్వాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అఖిల్‌ గురించి ఆరా తీశారు. రకరకాల దురలవాట్లకు బానిసైన అఖిల్‌ గురించి ఇంట్లో వారు ఎంతో మనోవేదనకు గురైనట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అఖిల్‌తో పాటు కుటుంబ సభ్యల ఫోన్‌ కాల్స్‌ను పరిశీలించగా కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. అఖిల్‌ తండ్రి భరత్‌ కొందరు ప్రముఖ రౌడీలకు అందుబాటులో ఉన్నట్లు తెలిసింది.

అఖిల్‌ మిస్సింగ్‌ ముందు అతని తండ్రి రౌడీలతో తరచూ మాట్లాడాడు. భరత్‌ జైన్‌ను పిలిచి విచారించగా అసలు విషయం తెలిసింది. కుమారుడిని తానే రౌడీలకు చెప్పి హత్య చేయించానని భరత్‌ జైన్‌ పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. మృతదేహం దొరకనందున పోలీసులు ఇంకా ధ్రువీకరించడం లేదు. అఖిల్‌ హతమై ఉంటాడని అనుమానంతో దేవరగుడిహళిలోని భరత్‌జైన్‌ ఫాంహౌస్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో శవం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిరాయి హంతకులు దొరికితే మిస్టరీ వీడనుంది.  

(చదవండి: కాళ్లు పట్టుకున్నా.. అన్నని వదల్లేదు.. భార్యతో సంబంధం పెట్టుకున్నాడంటూ..)

>
మరిన్ని వార్తలు