వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి

13 Mar, 2023 03:28 IST|Sakshi

వీపున కత్తితో అలాగే వచ్చిన వ్యక్తికి శస్త్రచికిత్స 

కర్నూలు(హాస్పిటల్‌): కత్తిపోట్లకు గురై వీపున కత్తితో వచ్చిన ఓ వ్యక్తికి కర్నూలు వైద్యులు సకాలంలో స్పందించి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డికి ఆస్తి వివాదాలు ఉండటంతో కొంత కాలంగా అనంతపురం పట్టణంలోని మారుతినగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. శనివారం రాత్రి భోజనం ముగించు­కుని బయట వాకింగ్‌ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కత్తి శ్రీనివాసరెడ్డి వీపున అలాగే దిగబడిపోయింది. వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కర్నూలు తీసుకెళ్లాలని వైద్యు­లు సూచించారు.

విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ వెంటనే కార్డియోథొరాసిక్‌ హెచ్‌వోడి డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితి గురించి అక్కడి వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. వెంటనే కర్నూలుకు తీసుకురండి ఆపరేషన్‌ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డిని కర్నూ­లు ప్ర­భు­త్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు.

తెల్లవారుజాము నుంచే ఎక్స్‌రే, సీటీస్కాన్‌ తీసి కత్తి ఎంత వరకు వెళ్లిందో పరిశీలించారు. ఆదివారం ఉదయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హరికృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీంద్రలతోపాటు అనస్తీషియా ప్రొఫెసర్‌ డాక్టర్‌ కొండారెడ్డితో కలిసి శ్రీనివాసరెడ్డికి ఆపరేషన్‌ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి కోలుకుంటున్నారని వివరించారు.

మరిన్ని వార్తలు