వరుసకు మరిదయ్యే వ్యక్తితో చనువు.. అనుమానంతో రగిలిపోయిన ప్రియుడు.. కక్ష పెంచుకుని..

10 May, 2023 05:16 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వరుసకు వదినయ్యే మహిళతో అవివాహిత యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ మరో యువకుడితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమెతోపాటు మరో యువకుణ్ణి కూడా దారుణంగా హతమార్చాడు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డపనస గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదడ్డపనస గ్రామానికి చెందిన వెలమల ఎర్రమ్మ (40) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన భాస్కరరావుతో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కాగా, వరుసకు మరిదయ్యే ముద్దాడ రామారావు (30) అనే అవివాహిత యువకుడు ఎర్రమ్మతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. 

మరొకరితో చనువుగా ఉంటోందని..
ఇదిలావుండగా.. ఎర్రమ్మ అదే గ్రామానికి చెందిన ముద్దాడ సంతోష్‌ (26)తో కొంతకాలంగా చనువుగా ఉంటోంది. ఎర్రమ్మ తనతోపాటు సంతోష్‌తో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రగిలిపోతున్న ముద్దాడ రామారావు  వారిద్దరిపైనా కక్ష పెంచుకున్నాడు. మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వంశధార ఎడమ కాలువలో స్నానం చేస్తున్న సంతోష్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

అనంతరం అదే కత్తి తీసుకుని సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఎర్రమ్మపైనా దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు