తల్లీకొడుకు అనుమానాస్పద మృతి

13 May, 2021 09:50 IST|Sakshi
సరస్వతి, మధుశంకర్‌ మృతదేహాలు

ఎస్‌ఆర్‌బీసీలో మృతదేహాలు లభ్యం

ఆస్తి కోసం హత్య చేశారని మృతురాలి తల్లి ఫిర్యాదు 

బనగానపల్లె రూరల్‌(కర్నూలు జిల్లా): మండలంలోని నందవరం గ్రామానికి చెందిన తలారి సరస్వతి (30), కుమారుడు మధుశంకర్‌ (12) అనుమానాస్పద స్థితి మృతి చెందారు. వారి మృతదేహాలు బుధవారం రాళ్లకొత్తూరు  సమీపంలోని దెయ్యాలకుంట వద్ద శ్రీశైలం కుడి ఉప కాలువ (ఎస్‌ఆర్‌బీసీ)లో లభ్యమయ్యాయి. ఇద్దరూ ఉదయమే పొలం వద్దకు వెళ్లారని, ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా సమీపంలోని కాలువలో కొట్టుకుపోతూ కని్పంచారని సరస్వతి మామ ఎర్రమద్దయ్య తెలిపాడు.

అయితే.. ఆస్తి విషయంలో హత్య చేశారంటూ సరస్వతి తల్లి జి.లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి కుమార్తె సరస్వతిని 13 క్రితం నందవరం గ్రామానికి చెందిన ఎర్రమద్దయ్య కుమారుడు మద్దిలేటికి ఇచ్చి వివాహం చేశారు. మద్దిలేటి లారీ క్లీనర్‌గా వెళ్తుంటాడు. వీరికి మధుశంకర్, మణికంఠ అనే ఇద్దరు కుమారులు. మధుశంకర్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.

కాగా.. వివాహం అయినప్పటి నుంచి సరస్వతిని భర్త, మామతో పాటు కొలిమిగుండ్లలో ఉంటున్న ఆడబిడ్డ మహేశ్వరి, ఆమె భర్త వేధింపులకు గురి చేసేవారు. తండ్రి  ఎర్ర మద్దయ్య పేరుతో ఉన్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిలో తనకూ వాటా  కావాలంటూ మహేశ్వరి గతంలో పలుమార్లు గొడవ పడింది. ఆస్తి ఇస్తేనే పుట్టింటికి వస్తానని తెగేసి చెప్పింది. అయితే.. ఇందుకు సరస్వతి అంగీకరించదనే ఉద్దేశంతో మామ, భర్త కలిసి ఆమెను, కుమారుడు మధుశంకర్‌ను హత్య చేసి కాలువలో పడేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని లక్ష్మీదేవి ఆరోపించింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు     చేస్తున్నామని సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు తెలిపారు.

చదవండి: చుండూరు ఎస్‌ఐ శ్రావణి మృతి  
ప్రైవేటు ల్యాబ్‌ల దందా: మోసం గురో..! 

మరిన్ని వార్తలు