అప్పటి వరకు ఆడుకున్నారు.. అంతలోనే!

16 Apr, 2021 15:32 IST|Sakshi

ఆడుకునేందుకు వెళ్లి నీటిలో గల్లంతు

ఒకరి మృతదేహం లభ్యం, 

 మరొకరి కోసం గాలింపు

సాక్షి, మహబూబాబాద్‌ రూరల్ ‌: మహబూబాబాద్‌ జిల్లా జమాండ్లపల్లి గ్రామశివారులోని మున్నేరువాగులో పడి ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ మండలంలోని జమాండ్లపల్లి గ్రామానికి చెందిన భట్టుపల్లి బాబు – లలిత దంపతుల రెండో కుమారుడు యశ్వంత్‌ (10), బొల్లెపల్లి భద్రాచలం – నర్మద దంపతుల కుమార్తె సాయిసహస్ర(10) కలిసి గ్రామశివారులోని మున్నేరువాగు వద్దకు ఆడుకునేందుకు గురువారం మధ్యాహ్నం వెళ్లారు.

అయితే, రాత్రి పొద్దుపోయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం ఆరా తీశారు. మున్నేరువాగు సమీపంలో పిల్లల చెప్పులు కనిపించగా నీటిలో పడి ఉంటారనే అనుమానంతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటలకు యశ్వంత్‌ మృతదేహం లభ్యం కాగా, సాయిసహస్ర మృతదేహం లభించలేదు. చీకటి పడినా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.  

మరిన్ని వార్తలు