సైకో డాక్టర్‌.. భార్య కాపురానికి రాలేదని..

27 Oct, 2020 07:34 IST|Sakshi
నిందితుడు సంతోష్‌   

భార్య, అత్తమామలపై కత్తితో దాడి

సాక్షి, హుబ్లీ: పండుగ వేళ ఆ ఇంట్లో రక్తం చిందింది. హుబ్లీ నగరంలో భార్య కాపురానికి రాలేదని ఉన్మాదిగా మారిన వైద్యుడు భార్య, ఆమె తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. మామ మరణించగా భార్య, అత్తకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. శంకర్‌ ముసన్నవర్‌ న్యాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌గా ఇటీవల రిటైరయ్యారు. ఈయన హుబ్లీ లింగరాజునగర్లో కుటుంబంతో ఉంటున్నారు. శనివారం ఉదయం వాకింగ్‌ వెళ్లడానికి సిద్ధమవుతుండగా అల్లుడు సంతోష్‌ చొరబడి కత్తితో విచ్చలవిడిగా దాడిచేశాడు. కత్తిపోట్లతో శంకర్‌ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య, కుమార్తె లతకు గాయాలయ్యాయి. అరుపులతో అప్రమత్తమైన స్థానికులు ఉన్మాది సంతోష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.   (ప్రేమ వివాహం.. భర్త హత్య)

ఇద్దరూ వైద్యులే  
సంతోష్‌– భార్య లతల మధ్య గొడవలే ఘోరానికి కారణమని తెలిసింది. వీరిద్దరూ కూడా వైద్యులే కావడం గమనార్హం. గొడవల వల్ల వేరువేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. లతా హుబ్లీలో తండ్రి ఇంట్లో నివసిస్తూ ఒక ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో పనిచేస్తోంది. దంత వైద్యుడైన సంతోష్‌ భార్యను తన వద్దకు పంపాలని అప్పుడప్పుడు మామ ఇంటికి వచ్చి ఘర్షణ పడేవాడు. ఎవరూ తన మాట వినడం లేదని చివరకు దారుణానికి ఒడిగట్టాడు. ఘటనాస్థలాన్ని పోలీస్‌ కమిషన్‌ లాబురామ్‌ పరిశీలించారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.   

మరిన్ని వార్తలు