యువతి ఫోన్‌.. పోలీసులే షాకయ్యారు!

9 Jan, 2021 13:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులో ఘటన

చెన్నై: తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడిని ధీటుగా ఎదుర్కొంది ఓ యువతి. తనను కాపాడుకునే క్రమంలో అతడిని కత్తితో పొడిచింది. దీంతో అతడు మరణించాడు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారమిచ్చిన సదరు యువతి తన నేరాన్ని అంగీకరించింది. వారం రోజుల క్రితం తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు.. తిరువల్లూర్‌ జిల్లాలోని శోలవరం ప్రాంతానికి చెందిన పందొమిదేళ్ల యువతిని ఆమె కజిన్‌(24) గత కొన్నిరోజులుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. (చదవండి: ప్రేమ వ్యవహారం: చెరువు గట్టు వద్ద కత్తిపోట్లతో..)

ఈ క్రమంలో ఆదివారం ఆమె కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లగా, మాటువేసిన మృగాడు లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో యువకుడు వెంట తెచ్చుకున్న కత్తి కిందపడగా, వెంటనే దానిని తీసుకున్న యువతి అతడి మెడ, ముఖంపై దాడి చేసింది. ఈ ఘటనలో అతడు మృతి చెందాడు. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చింది. ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘అక్కడ ఏం జరిగిందో ఆమె కళ్లకుగట్టినట్లుగా వివరించింది. తను ఎందుకు అలా చేసిందో స్పష్టంగా చెప్పింది. 

ఆమె చాలా ధైర్యవంతురాలు. నిజాయితీపరురాలు కూడా. వాంగ్మూలం ఇచ్చేటపుడు ఏమాత్రం భయపడలేదు. నిజానికి తను ఫోన్‌ చేయగానే మావాళ్లు షాకయ్యారు. మృతుడు ప్రవర్తనతో విసుగెత్తిన ఆమె కుటుంబ సభ్యులు గతంలోనే అతడిని హెచ్చరించారు. అయినా తన తీరు మార్చుకోలేదు. సెక్షన్‌ 100 కింద కేసు నమోదు చేశాం. ఆత్మరక్షణ కోసం జరిగిన హత్య కాబట్టి ఆమెకు కొన్ని మినహాయింపులు లభిస్తాయి’’ అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు