ఎగిరిపోయిన ‘హెలికాప్టర్‌ బ్రదర్స్‌’... రూ.600 కోట్ల మోసం?

23 Jul, 2021 07:56 IST|Sakshi
హెలికాప్టర్‌ బ్రదర్స్‌ రూ. 600 కోట్లతో పారిపోయారంటూ వెలిసిన ఫ్లెక్సి

ఫైనాన్స్‌ కంపెనీ బోర్డు తిప్పేసిన బీజేపీ హెలికాప్టర్‌ బ్రదర్స్‌

టీ.నగర్‌: కుంభకోణంలో ఫైనాన్స్‌ సంస్థ నడపి నగదు మోసానికి పాల్పడిన  బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు. తిరువారూరు జిల్లా మరైయూరుకు చెందిన సోదరులు గణేష్‌ (50), స్వామినాథన్‌ (47) తంజావూరు జిల్లా కుంభకోణంలో నివసిస్తున్నారు. అక్కడ విక్టరీ ఫైనాన్స్, కోరకైలో గిరీష్‌ డెయిరీ ఫామ్‌ నడుపుతున్నారు. విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వీరు సొంతంగా హెలికాప్టర్‌ కలిగి ఉన్నారు. గణేష్‌ బీజేపీ వర్తక విభాగం పదవిలో ఉన్నారు. వీరి ఫైనాన్స్‌ కంపెనీలో పెట్టుబడి పెడితే ఏడాదిలో రెట్టింపు ఇస్తామని ప్రజల వద్ద నగదు వసూలు చేశారు. ఇందుకోసం ఏజెంట్లను నియమించి కమీషన్లు అందజేశారు. 

ఇలాఉండగా కోట్లాది రూపాయల నగదు డిపాజిట్‌ చేసిన పలువురికి కరోనా వైరస్‌ కారణం చూపి నగదు సక్రమంగా చెల్లించలేదని ఫిర్యాదులు అందాయి. కుంభకోణానికి చెందిన జబరుల్లా–ఫిరోజ్‌భాను గణేష్, స్వామి నాథన్‌ రూ.15 కోట్ల వరకు మోసగించినట్లు తంజావూరు ఎస్పీ దేశ్‌ముఖ్‌ శేఖర్‌ సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. డీఐజీ ప్రవేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సంస్థ ఉద్యోగులను విచారించారు. జీఎం శ్రీకాంత్‌ను అరెస్టు చేసి పోలీసులు బుధవారం ఉదయం గణేష్‌ ఇంట్లో తనిఖీలు జరిపారు.

 మరో ఇద్దరిపై  కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. కుంభకోణంలో రూ.600 కోట్ల మేరకు మోసం జరిగినట్లు నగరంలో పోస్టర్లు వెలిశాయి. వీటిని అతికించిన వ్యక్తుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. అతన్ని ఉత్తర జిల్లా వర్తక సంఘం అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సతీష్‌కుమార్‌ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు