Tamil Nadu Crime: రాత్రి నిద్రిస్తుండగా.. భార్య అనుకుని మరొకరిని..

22 May, 2022 07:24 IST|Sakshi
హత్యకు గురైన కౌసర్‌(ఫైల్‌), నిందితుడు దేవేంద్రన్‌

వేలూరు(తమిళనాడు): తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని ఇందిరానగర్‌కు చెందిన దేవేంద్రన్‌(55) పశువుల వ్యాపారి. ఇతని మొదటి భార్య రేణుకాంబాల్‌ రెండు సంవత్సరాల క్రితం మృతి  చెందింది. దీంతో గ్రామానికి చెందిన సురేష్‌ మృతి చెందడంతో అతని భార్య ధనలక్ష్మిని 5 నెలల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. దీంతో ధనలక్ష్మి తరచూ భర్తను వదిలి పెట్టి ఆంబూరులోని బంధువుల ఇంటికి వచ్చేది. అదే తరహాలో వారం క్రితం ధనలక్ష్మి భర్తతో ఘర్షణ పడి ఆంబూరుకు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఆంబూరు కంబికొల్‌లై గ్రామానికి చెందిన జాన్‌ భాషా అనే వ్యక్తి ఓ చోరీ కేసులో అరెస్ట్‌ అయ్యి వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని భార్య కౌసర్‌(36) ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. ఆంబూరు రైల్వే స్టేషన్‌ సమీపంలోని షూ కంపెనీ ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌పై రోజూ రాత్రి వేళ ధనలక్ష్మి నిద్రిస్తున్నట్లు దేవేంద్రన్‌కు తెలిసింది.

శుక్రవారం రాత్రి ధనలక్ష్మి, జాన్‌ బాషా భార్య కౌసర్, ఈమె అత్త పర్వీన్‌ చిన్నారులతో కలిసి నిద్రించారు. వారందరూ బురకా ధరించి ఉండడంతో దేవేంద్రన్‌ తన భార్య అని భావించి కౌసర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. శబ్ధం విన్న ధనలక్ష్మి వెంటనే కేకలు వేయడంతో ఆగ్రహించిన దేవేంద్రన్‌ ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. స్థానికులు దేవేంద్రన్‌ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆంబూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: తాగిన మైకంలోనే నీరజ్‌ హత్యకు స్కెచ్‌.. చంపినవాళ్లను అరెస్ట్‌ చేశాం: డీసీపీ

మరిన్ని వార్తలు