వైరల్‌ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..!

23 Aug, 2021 11:17 IST|Sakshi

కన్న తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు పుట్టినా ఒకటే.. చచ్చినా ఒకటే...!  తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు పుట్టలో పుట్టి చచ్చే చెద పురుగులతో సమానం. వారి వల్ల ఏం ప్రయోజనం లేదని వేమన మహాకవి ఏనాడో.. చెప్పాడు. అదే సరియైనదని నేటి సమాజంలో ఎన్నో ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన ఘటన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. కన్న కొడుకు కంటే పెంపుడు కుక్క నయం అని నిలదీస్తోంది.

చదవండి: Afghanistan-CAA: అఫ్గాన్‌ నుంచి భారత్‌లోకి ఎంట్రీ.. తెరపైకి సీఏఏ

చెన్నై: తమిళనాడులోని పొన్నేరిపట్టిలో ఓ వ్యక్తి డబ్బుల కోసం తన తల్లిపై దారుణంగా దాడి చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘నల్లమ్మల్ అనే వృద్ధురాలు తన భర్త చనిపోయిన తర్వాత పొన్నేరిపట్టిలో ఒంటరిగా నివసిస్తోంది.  ఆమె అప్పటికే తన భూమిని తన కొడుకు పేరు మీద రిజిస్టర్ చేసింది. ఇక ఆ వృద్ధురాలు ఎంఎన్‌ఆర్‌ఈజీఏ పథకం కల్పించే పనులకు వెళ్లి.. దాని​ ద్వారా వచ్చిన సంపాదనతో జీవిస్తోంది.

ఆ విధంగా నల్లమ్మల్ పైసా పైసా పోగు చేసి రూ. 3 లక్షలు ఆదా చేసింది. ఆ డబ్బుల కోసం షణ్ముగం తన తల్లిని రోడ్డుపైకి లాగుతూ ఆమె నుంచి కీలను లాక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే నల్లమ్మల్ కుక్క షణ్ముగంపై దాడి చేసి ఆ వృద్దురాలిని కాపాడే ప్రయత్నం చేసింది.’’ అని తెలిపారు.కాగా  ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో గుర్తించిన నామక్కల్‌ పోలీసులు కేసు నమోదు చేసి షణ్ముగంను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అతని భార్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్లమ్మల్‌కు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ఇది చాలా దారుణం.. అతడు కొడుకు కాదు.. రాక్షసుడు. అతడిని వెంటనే శిక్షించాలి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
 


చదవండి: దారుణం: కన్నతల్లిపై కొడుకు, కోడలి పైశాచికత్వం..

మరిన్ని వార్తలు