దేవుడికి మొక్కు.. ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

2 Nov, 2020 12:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: చదువుకున్న ప్రతి యువకుడి అతిమ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం. ఎంత పెద్ద చదువు చదవినా.. నిద్రలేని రాత్రులు గడిపినా వారి ప్రయత్నమంతా గవర్నమెంట్‌ జాబ్‌ కోసమే. ఒక్కసారి జాబ్‌ వచ్చిందంటే  ఇక వారి ఆనందానికి హద్దులే ఉండవు. అయితే ఈ ప్రయత్నంలో ఎంత కష్టపడ్డా కోరుకున్న ఉద్యోగం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన యువకులు, నిరుద్యోగుల సంఖ్య కోకొల్లలు. దేశంలో రోజు నమోదు అవుతున్న ఆత్మహత్యల కేసుల్లో సింహ భాగం వీరిదే ఉంటుంది. (నీవు లేక నేనుండ లేను.. నీ వద్దకే వస్తా)

అయితే ఓ యువకుడు విచిత్రంగా తనకు ఉద్యోగం వచ్చిందని ప్రాణం తీసుకున్నాడు. వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. నమ్మి తీరాల్సిందే. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఎస్‌ నవీన్‌ (33) అనే యుకుడికి ఇటీవల ఓ జాతీయ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం లభించింది. ఆర్థిక రాజధాని ముంబైలో పోస్టింగ్‌.  ఎన్నో ప్రయత్నాల తరువాత  ఉన్నత ఉద్యోగం రావడంతో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఎంతో సంతోషపడ్డారు. అయితే ఉద్యోగంలో చేరిన 15 రోజుల్లోనే నవీన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబై నుంచి త్రివేండ్ర వెళ్తున్న రైలు కింద పడి గత శనివారం ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల్లో విషాదంలో నింపింది.

అయితే నవీన్‌ ఆత్మహత్యపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్‌ విషయం తెలిసింది. అతని చేబులో స్వాధీనం చేసుకున్న సూసైడ్‌ లెటర్‌ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే తన ప్రాణాలు అర్పిస్తానని దేవుడికి మొక్కినట్లు దానిలో రాసిఉంది. ‘ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నా. ఎన్నో ప్రార్థనలు చేశా. జాబ్‌ వస్తే తన ప్రాణలు అర్పిస్తా అని మొక్కినా. చివరికి ప్రార్థనలు ఫలించి బ్యాంక్‌ మేజేజర్‌ పోస్టు వచ్చింది. 15 రోజులు ఉద్యోగం చేశా. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆత్మహత్య చేసుకుంటున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ నోట్‌లో పేర్కొన్నాడు.

మరోవైపు నవీన్‌ సూసైడ్‌ లెటర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది అతనే రాశాడా లేక దీని వెనుక ఎవరి కుట్రైనా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగం వస్తే ఆత్మహత్య చేసుకోవడం ఏంటనీ మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు..మృతదేహాన్ని కన్యాకుమారిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు