మంత్రి ‘పిఏ’ కిడ్నాప్‌....!

24 Sep, 2020 08:22 IST|Sakshi

పట్ట పగలు ఘటన

పోలీసుల గస్తీ ముమ్మరంతో

10 కి.మీ దూరంలో వదలి వెళ్లిన కిడ్నాపర్లు

సాక్షి, చెన్నై : తమిళనాడు పశుసంవర్థక శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్‌ వ్యక్తిగత పిఏ కర్ణన్‌ను పట్టపగలు నలుగురు యువకులు కిడ్నాప్‌ చేశారు. పోలీసులు గస్తీ ముమ్మరం చేయడంతో పది కి.మీ దూరం వెళ్లి రోడ్డు మీద వదిలి పెట్టి వెళ్లారు. తిరుప్పూర్‌ జిల్లా ఉడుమలైలో మంత్రి రాధాకృష్ణన్‌ ఎమ్మెల్యే కార్యాలయం ఉంది. ఇక్కడ వ్యక్తిగత పిఏగా కర్ణన్‌ వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చిన నలుగురు యువకులు సిని తరహాలో కత్తులతో బెదిరించి ఆయన్ను కారులో ఎక్కించుకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడ మహిళా సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో తిరుప్పూర్‌ జిల్లా పోలీసులు అంతా రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు ముమ్మరం అయ్యాయి. 

ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసు అధికారులు, అక్కడి సిసి కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా ఆ కారు, అందులో వచ్చిన నలుగురి కోసం వేట ముమ్మరం చేశారు. మంత్రి పిఏ కిడ్నాప్‌ సమాచారం ఉడుమలైలో కలకలం రేపింది. పోలీసులు నిఘా పెంచడంతో పాటుగా వ్యవహారం మీడియాల్లో హాట్‌ టాపిక్‌గా మారడంతో కిడ్నాపర్లు అప్రమత్తమైనట్టున్నారు. ఉడుమలై నుంచి పది కి.మీ దూరం వెళ్లిన కిడ్నాపర్లు, అక్కడ రోడ్డు పక్కగా కర్ణన్‌ను దించే వెళ్లి పోయారు. అయితే, ఈ కిడ్నాప్‌ ఎందుకు జరిగింది..? ఎవరు చేయించారు..? దీని వెనుకు ఉన్న రహస్యం బయట తీయడానికి పోలీసులు ఉరకలు తీస్తున్నారు. అయితే,కిడ్నాపర్లు నలుగురు మాస్క్‌లు ధరించి రావడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారి ఉన్నది. 

ఆన్‌లైన్‌ మోసంతో .......
ఈ కిడ్నాప్‌ను పక్కన పెడితే, చెన్నైలో మరో కిడ్నాప్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాగర్‌ కోయిల్‌లో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మోహన్‌ అనే ఉద్యోగిని కోయంబత్తూరుకు చెందిన రమేష్‌ రెడ్డి, ప్రభాకరన్‌లు కిడ్నాప్‌ చేసి చెన్నై పోలీసులకుఅ డ్డుంగా బుక్కయ్యారు. ఆన్‌లైన్‌లో నగదు బదిలీ పేరిట తనను మోసగించడమే కాకుండా, తరచూ డబ్బుల కోసం ప్రభాకరన్, రమేష్‌రెడ్డిలు వేదిస్తుండటంతో ఇవ్వలేని పరిస్థితుల్లో మోహన్‌ పడ్డాడు. దీంతో మోహన్‌ను కిడ్నాప్‌ చేసిన ప్రభాకరన్, రమేష్‌ రెడ్డిలు అడయార్‌ ఏసి విక్రమన్‌కు  వచ్చిన సమాచారం మేరకు బుక్కయ్యారు.

మరిన్ని వార్తలు