వివాహేతర సంబంధం: కుమారుడి హత్య, తల్లికి జీవిత ఖైదు 

26 Mar, 2021 10:11 IST|Sakshi

తిరువొత్తియూరు: సేలం సమీపంలో వివాహేతర సంబంధం కోసం కుమారుడిని హత్య చేసి అదృశ్యం అయ్యాడని నాటకమాడిన మహిళకు గురువారం సేలం మహిళా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సేలం సమీపంలోని అటయాపట్టి ఎస్‌.పాపరాంపట్టికి చెందిన మణికంఠన్‌ భార్య మైనావతి (26). వీరి కుమారులు శశికుమార్‌ (07), అఖిల్‌ (03). రెండవ కుమారుడు అఖిల్‌ను మైనావతి తన తల్లి ఇంటిలో విడిచిపెట్టింది. ఈ క్రమంలో గత 2018వ సంవత్సరం మార్చి 5వ తేదీ ఆడుకోవడానికి వెళ్లిన శశికుమార్‌ కనపడలేదని మైనావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆటయాంపట్టి సమీపంలో వున్న వ్యవసాయ బావిలో శశికుమార్‌ మృతి చెంది నీటిలో తేలుతూ వున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేయగా మైనావతి వివాహేతర సంబంధం కోసం తన తనయుడిని బావిలోకి తోసి హత్య చేసి నాటకమాడినట్లు తెలిసింది. మైనావతికి తన భర్త స్నేహితుడు అయిన దేవరాజ్‌ (25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి అడ్డుగా ఉన్న కుమారుడిని హత్య చేసి అతనితో వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి మైనావతిని, దేవరాజ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ గురువారం సేలం మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. విచారణ అనంతరం కుమారుడిని హత్య చేసిన మైనావతికి సేలం మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించి అలాగే దేవరాజుకు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతనిని నిర్ధోషిగా విడుదల చేసింది.
చదవండి: వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం

మరిన్ని వార్తలు