ఉన్మాదిలా మారిన ఐటీ ఉద్యోగి.. భార్యను క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి

3 Jan, 2022 07:47 IST|Sakshi
భార్య, పిల్లలతో మణిగండన్‌ (ఫైల్‌)

సాక్షి, చెన్నై(తమిళనాడు):  రెండేళ్లుగా చవి చూసిన కష్టాలతో ఓ ఐటీ ఉద్యోగి ఉన్మాది మారాడు. తన భార్యను క్రికెట్‌బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల్ని తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం చెన్నై పెరుంగుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరుంగుడిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మణిగండన్‌(42) నివాసం ఉంటున్నాడు.

ఆయనకు భార్య ప్రియ(36), ధరన్‌(10), దహన్‌(01) అనే కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు ఓ ఐటీ సంస్థలో మణిగండన్‌ ఉద్యోగం చేసేవాడు. లగ్జరీ గానే కుటుంబ జీవనం సాగింది. అయితే, హఠాత్తుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటికే మణిగండన్‌ పరిమితం అయ్యాడు. కుటుంబ పోషణ∙కోసం కొన్ని ప్రైవేటు బ్యాంక్‌ల నుంచి, స్నేహితుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశాడు.  ప్రస్తుతం అప్పులు భారంగా మారడంతో మణిగండన్‌ ఉన్మాది అయ్యాడు.

ఆదివారం భార్య ప్రియను, బిడ్డలను చంపేశాడు. ఆ తర్వాత వంట గదిలో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట     జీహెచ్‌కు తరలించారు.   

మరిన్ని వార్తలు