అత్యాధునిక  వైద్యం అందిస్తామని డబ్బు వసూళ్లు

17 Jun, 2021 04:29 IST|Sakshi
నారా లోకేష్‌తో వీర్రాజు

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ముసుగులో టీడీపీ కార్యకర్త మోసం

కాకినాడ క్రైం: టీడీపీ హయాంలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగం పొందిన ఓ  కార్యకర్త .. వైద్యులు, నర్సుల పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వైనం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం నాయకంపల్లికి చెందిన ఉండవల్లి వీర్రాజు నారా లోకేష్‌ సిఫారసుతో నక్షత్ర అవుట్‌సోర్సింగ్‌ కంపెనీ ద్వారా కాకినాడ జీజీహెచ్‌లో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో డెస్క్‌ టాప్‌ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ నెల 1వ తేదీన రాయుడు సూర్యకుమారి అనే 58 ఏళ్ల మహిళ కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరగా వారి సహాయకులను తన బుట్టలో వేసుకున్నాడు. వైద్యులు, నర్సులతో చెప్పి అత్యాధునిక వైద్యం అందేలా చేస్తానని చెప్పి.. ఫోన్‌పే ద్వారా బాధితురాలి కుమారుడి నుంచి రూ.75 వేలు వసూలు చేశాడు.

ఆరోగ్యం విషమించి సూర్యకుమారి ఈ నెల 8న మృతి చెందింది. దీంతో మృతురాలి కుమారుడు బుధవారం సాయంత్రం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలంటూ అసిస్టెంట్‌ కలెక్టరు ఆదేశించారు. కాగా, ఉద్యోగంలో చేరిన నాటినుంచి నారా లోకేష్, చంద్రబాబు, యనమల రామకృష్ణుడు పేర్లు చెప్పి వీర్రాజు దందా చేసేవాడని అక్కడి వారు చెబుతున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తానని తమ వద్ద కూడా రూ.1.5 లక్షలు వసూలు చేశాడని బాధితులు చెబుతున్నారు. ఇలా చాలామంది బాధితులున్నట్లు విచారణలో తేలిందని కాకినాడ ఒకటో పట్ణణ సీఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంకా ఎవరైనా బాధితులుంటే.. 94407 96539కు  ఫోన్‌ చేయవచ్చునని ఆయన చెప్పారు. 

మరిన్ని వార్తలు